కాకినాడ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాకినాడ జిల్లా పి. వేమవరం గ్రామానికి చెందిన నులకతట్టు కృష్ణప్రసాద్ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితమే అతను గ్రామానికి తిరిగి వచ్చాడు. కిరణ్ కార్తీక్ తన చెల్లితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని, ప్రేమిస్తున్నాడని అనుమానించిన కృష్ణప్రసాద్ అతన్ని మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.గత నెల 24న కృష్ణప్రసాద్, అతని స్నేహితుడు దూళ్లపల్లి వినోద్ కలిసి కిరణ్ కార్తీక్ను పార్టీ ఇస్తామని నమ్మించి బ్రహ్మానందపురం జగనన్న లేఔట్కు తీసుకువెళ్లారు. అక్కడ కార్తీక్ తలను నేలకేసి కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే మట్టిలో పూడ్చిపెట్టి, రెండు రోజుల తర్వాత కృష్ణప్రసాద్ హైదరాబాద్ వెళ్లిపోయాడు.కిరణ్ కార్తీక్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి వీరవెంకట రమణ గత నెల 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూలీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడని మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.విషయం బయటపడుతుందని భయపడిన కృష్ణప్రసాద్ శుక్రవారం ఉదయం సామర్లకోటకు చేరుకుని వినోద్ను తీసుకుని వీఆర్ఓ వద్దకు వెళ్లి తామే హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. వీఆర్ఓ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్పు చేశారు.తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కార్తీక్ మృతదేహాన్ని వెలికి తీశారు. హత్య జరిగి పది రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుమారుడి హత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa