ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారవుతున్న, అమ్ముడవుతున్న హెల్మెట్లపై ఉక్కుపాదం మోపింది. అటువంటి హెల్మెట్లను తయారుచేసే సంస్థలు, విక్రయించే రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఐఎస్ఐ మార్క్ ఉన్న, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని ప్రజలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.దేశంలో 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, రైడర్ల భద్రత అత్యంత ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంది. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని గుర్తుచేసింది. రోడ్ల పక్కన అమ్మే నాణ్యత లేని హెల్మెట్ల వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నాణ్యమైన హెల్మెట్ల వాడకం ద్వారా తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాలు తగ్గుతున్నప్పటికీ, ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.హెల్మెట్ల నాణ్యతను నిర్ధారించేందుకు 2021లోనే కేంద్రం ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే విక్రయించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 176 సంస్థలకు మాత్రమే నాణ్యమైన హెల్మెట్లు తయారు చేయడానికి బీఐఎస్ లైసెన్సులు ఉన్నాయి.నిబంధనల అమలును పర్యవేక్షించడానికి బీఐఎస్ అధికారులు నిరంతరం ఫ్యాక్టరీలు, మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 500కు పైగా హెల్మెట్ నమూనాలను పరీక్షించగా, బీఐఎస్ మార్క్ను దుర్వినియోగం చేస్తున్న వారిపై 30కి పైగా సోదాలు నిర్వహించి, హెల్మెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఢిల్లీలోనే లైసెన్సులు రద్దయిన 9 సంస్థల నుంచి 2,500కు పైగా నాణ్యత లేని హెల్మెట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి కేంద్రం ఇప్పటికే లేఖలు రాసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa