జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిన కేసులో ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు కారణంగా న్యాయవ్యవస్థ అనుమతి లేకుండా న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి వీల్లేకుండా పోయిందని ఆయన అన్నారు.సోమవారం కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మ కేసును ప్రస్తావిస్తూ, ఓ హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో అంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ‘ఘోరమైన నేరం’ అని అభివర్ణించారు. “ఆ డబ్బు ఎక్కడిది దాని మూలాలేంటి ఒక న్యాయమూర్తి ఇంటికి అది ఎలా చేరింది అని ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనలో పలు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.“కేంద్ర ప్రభుత్వం చేతులు కట్టేసినట్లుగా ఉంది. 90వ దశకంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు కారణంగా మేం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నాం. నేను న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని, న్యాయమూర్తుల రక్షణను గట్టిగా సమర్థిస్తాను. అనవసరమైన వ్యాజ్యాల నుంచి వారిని కాపాడాలి. కానీ ఇలాంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది,” అని ధన్ఖడ్ అన్నారు. మార్చి 14, 15 తేదీల మధ్య రాత్రి న్యాయవ్యవస్థకు ఒక చీకటి రాత్రి అని ఆయన వ్యాఖ్యానించారు.గతంలో జస్టిస్ వర్మ ఢిల్లీ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు, బయట ఉన్న ఓ గదిలో కాలిపోయిన నోట్ల కట్టల సంచులు బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ జరుపుతోంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు గతంలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa