కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలందరినీ వైఎస్సార్సీపీ నేతలు కించపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై వ్యక్తిగత దూషణకు దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా తప్పుడు మార్గంలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయం నుంచి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసన్నకుమార్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ మీడియా ఎదుట డిమాండ్ చేశారు.
ప్రసన్నకుమార్ రెడ్డికి వరుసకు తాను చెల్లెలు అవుతానని, అలాంటి తనపై ఇలా నీచపు వ్యాఖ్యలు చేశారంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీ నేతలకి చెల్లెళ్లను గౌరవించే సంస్కృతి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ నేతలు మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తే జగన్ ఎందుకు ఖండించలేదంటూ ఆమె ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో తట్టుకోలేకే ప్రసన్నకుమార్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.
అయితే, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డ టీడీపీ శ్రేణులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి చేశారు. దాంతో ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి సమయంలో దాడి జరిగితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఏంటంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రసన్నకుమార్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే పోలీసుల నుంచి కనీస స్పందన కూడా లేదంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa