దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నది వాస్తవమే అని అంగీకరించారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులు ఉన్నారనేది నిజమేనని ఆయన తెలిపారు. గతంలో టీటీడీ కాలేజీలు, స్కూళ్లు, పరిపాలన విభాగాల్లో హిందువులు కాని వారిని ఉద్యోగులుగా నియమించారని ఆయన చెప్పారు.
ఎంతమంది ఉన్నారనే దానిపై నివేదిక కోరామని.. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం వారిని ఏ విభాగాలకు బదిలీ చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. దేవదాయ శాఖకు టీటీడీ నుంచి ఎంత సీజీఎఫ్ రావాలనే దానిపై కూడా చర్చించామని.. ఈ అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
టీటీడీలో వెయ్యిమందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని.. వారికి సనాతన ధర్మంపై విశ్వాసం లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండు రోజుల కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆనం స్పందిస్తూ.. టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారని.. అయితే వారు ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ను పరిశీలించి, న్యాయపరమైన సమస్యలు ఏమైనా తలెత్తుతాయా అని తెలుసుకున్న తర్వాత వారిని ఏ విభాగాలకు బదిలీ చేయాలో నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు.
టీటీడీ నుంచి దేవదాయ శాఖకు ఎంత సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) రావాలనే అంశంపై కూడా మంత్రి ఆనం ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ వేదపండితులకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే అంశంపై కూడా చర్చించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 2.10 ఎకరాల భూమిని అమ్మవారి ఆలయానికి లీజుకు ఇవ్వాలని కోరగా, టీటీడీ సానుకూలంగా స్పందించింది. ఈ స్థలం అందుబాటులోకి వస్తే కార్ పార్కింగ్, వసతి సముదాయాలు, కొత్త రోడ్డును నిర్మించవచ్చు. దీనివల్ల భక్తులు ఒక మార్గంలో పైకి వెళ్లి, మరో మార్గంలో కిందకు వచ్చే అవకాశం ఉంటుంది.
దేవదాయ శాఖ పరిధిలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్న 1,014 ఆలయాలకు ఆగస్టులో కొత్త పాలకవర్గాలను నియమిస్తామని మంత్రి తెలిపారు. అలాగే, రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం ఉన్న 500 ఆలయాలకు రెండు, మూడు నెలల్లో పాలకవర్గాలను నియమిస్తామని ఆయన చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆలయాల నిర్మాణాలకు రూ.147 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఖర్చుల వివరాలు అందిన వెంటనే నిధులు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa