ఆంధ్రప్రదేశ్లో కూడా హైటెక్ సిటీ ఏర్పాటు అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 'స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047' లక్ష్యసాధన కోసం దేశంలో అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలతో టాస్క్ఫోర్స్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కోసం ఒక టాస్క్ఫోర్స్ కొన్ని సిఫార్సులు చేసింది. అమరావతి రింగ్ రోడ్డులో హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. కృత్రిమ మేధ (ఏఐ), సెమీ కండక్టర్ల వంటి అత్యాధునిక పరిశ్రమలను అభివృద్ధి చేయాలని సూచనలు చేసింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ ఈ నివేదికను రూపొందించగా.. ఢిల్లీలో విడుదల చేశారు. టాస్క్ఫోర్స్ 360 పేజీల నివేదికను తయారు చేసింది.
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డ్రోన్స్ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపింది. తిరుపతి జిల్లాలోని ‘శ్రీ సిటీ’ తరహాలో ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలని సూచించింది. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని పేర్కొంది. పరిశోధన సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని సిఫారసు చేసింది. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ధి చేయాలని కూడా తెలిపింది. రాష్ట్రంలోని జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి వంటి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు తయారు చేసే పరిశ్రమలు.. వీటితో పాటు బ్లూ ఎకానమీ, రోబోటిక్స్, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, ఏఐ వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచనలు చేశారు. థీమ్ ఆధారిత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం.. నైపుణ్యాభివృద్ధి కూడా అవసరమన్నారు. పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు. చంద్రబాబు ప్రతిపాదించిన పీ4 విధానం రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని.. ఇలాంటి మంచి ఆలోచనలను రాష్ట్రం వెంటనే తీసుకోవాల్నారు.
'ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఏఎంటీజెడ్) ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి. లైఫ్సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో మంచి అవకాశాలను అందుకోవడానికి ప్రపంచ స్థాయి సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలి. సెమీకండక్టర్లు, ఫ్యాబ్స్, డిస్ప్లే యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్, సోలార్ సెల్స్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమలను నెలకొల్పడంపై శ్రద్ధ పెట్టాలి. అప్పులు అభివృద్ధికి అడ్డు రాకుండా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, జీవశాస్త్ర సాంకేతికత, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, నీలి ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు' అంటున్నారు. మరి ఏపీ ప్రభుత్వం హైటెక్ సిటీ ఏర్పాటు సూచనపై ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa