ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తులకు లడ్డూ, అన్నప్రసాదాలకు ఇబ్బంది లేదు.. రూ.8.13 కోట్లతో టీటీడీ ప్లాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 05:13 PM

తిరుమలలో ఐవోసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) గ్యాస్ స్టోరేజ్‍కి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శంకుస్థాపన చేశారు. తిరుమల ఔటర్‌ రింగ్‌రోడ్డులో ఐవోసీఎల్‌ గ్యాస్‌ స్టోరేజ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. 45 టన్నుల గ్యాస్‌ నిల్వ ఉంచేలా స్టోరేజ్‌ కేంద్రాన్ని రూ.8.13 కోట్లతో ఐవోసీఎల్, టీటీడీ కలిసి నిర్మిస్తారు.. ఈ మేరకు టీటీడీ 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా గ్యాస్‌ సరఫరా చేసేందుకు ఐవోసీఎల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రూ.12.5 కోట్లతో డంపింగ్‌ యార్డు దగ్గర బయో గ్యాస్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఐవోసీఎల్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో రోజుకు 55 టన్నుల తడి వ్యర్థాలు వస్తాయి.. అందులో 40 టన్నుల వ్యర్థాలను ఐవోసీఎల్‍కు ఇస్తారన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. రోజుకు వెయ్యి కేజీల బయో గ్యాస్ ఉత్పత్తితో టీటీడీ రూ.1.50 కోట్లు ఆదా అవుతుంది అంటున్నారు. లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగిస్తామన్నారు.


'టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించాము గత రెండు దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ-ఐఓసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను టీటీడీ-ఐఓసీఎల్ సంయుక్తంగా ఆరు నెలల్లో పూర్తి చేస్తుంది. ఈ గ్యాస్‌ను లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తాం. ఐఓసీఎల్ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద రూ.12.05 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. ప్రతి రోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు 1000 కేజీల బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్ లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్‌, ఐఎల్‌ఎస్‌డీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్మణ్యం, డీఈ శ్రీ చంద్రశేఖర్, ఇతర టీటీడీ, ఐఓసీఎల్ అధికారులు పాల్గొన్నారు' అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.


మరోవైపు తిరుమలలోని కాకులమాను తిప్ప దగ్గర ఐవోసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ 2.22 ఎకరాల్లో బయో గ్యాస్ ప్లాంటును ఐవోసీఎల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ బయో గ్యాస్ ప్లాంటును రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.12.85 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టారు.. ఇందులో ఐవోసీఎల్ రూ.7.05 కోట్లు, టీటీడీ రూ.5.80 కోట్ల నిధుల్ని సమకూర్చనుంది.


తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటు నిర్మాణం కనుక పూర్తయితే మిశ్రమ వ్యర్థాల ద్వారా బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేసి రెండున్నర కిలో మీటర్ల దూరంలోని తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైపు లైన్ ద్వారా పంపిణీ చేయొచ్చు అంటున్నారు. మొత్తం మీద టీటీడీ గ్యాస్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లడ్డూ, అన్న ప్రసాదాల తయారీకీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa