అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ నేతలు సహా నలుగురు హత్యకు గురయ్యారు. తాజాగా, రాజధాని పట్నాలోని ప్రముఖ పారస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. సినీ ఫక్కీలో ఐదుగురు తుపాకులతో ఆసుపత్రికి దర్జాగా వచ్చి.. హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్పై కాల్పులు జరిపి పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి సీసీటీవీలో రికార్డుకాగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఐదుగురు తుపాకులతో క్యాబిన్ తలుపు తెరిచి లోపలికి ప్రవేశించి, కాల్పుల జరపడం స్పష్టంగా రికార్డయ్యింది. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న చందన్ మిశ్రా అనే గ్యాంగ్స్టర్ను ప్రత్యర్ధి ముఠా ఆసుపత్రిలో హత్య చేసింది. కాల్పల్లో తీవ్రంగా గాయపడిన చందన్.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
బక్సర్ జిల్లాకు చెందిన చందన్ మిశ్రాపై ముప్పైకిపైగా హత్య కేసులు ఉన్నాయి. ఇటీవలే అరోగ్య కారణాలతో పెరోల్పై విడుదలైన అతడు.. చికిత్స కోసం పట్నాలోని పారస్ హాస్పిటల్లో చేరాడు. ప్రత్యర్థి ముఠా ‘చందన్ షేర్ గ్యాంగ్’ ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చందన్ను ఎవరెవరు కలిశారు? ఆసుపత్రిలోకి ఈ దుండగులు ఎలా ప్రవేశించారు? హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది వారికి సహకరించారా? అనేది పరిశీలిస్తున్నాం’’ అని అన్నారు. నితీశ్ పాలనలో పట్నా హత్యా రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
కాగా, పట్నాలో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకటైన పారస్లో ఇలా ఓ గ్యాంగ్స్టర్ను కాల్చి చంపగలిగితే, బీహార్లో సాధారణ ప్రజలకు భద్రత ఉందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇది సాధారణ ఘటన కాదు... తీవ్ర నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తి ఆసుపత్రిలోనే హత్యకు గురికావడం విచారకరం. ఆసుపత్రిలో భద్రత ఉండగా గన్మెన్లు ఎలా లోపలికి వచ్చారు అన్నదానిపై విచారణ జరుగుతుంది’’ అన్నారు.
ఈ ఘటనతో బిహార్లో మరోసారి శాంతిభద్రతల అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘‘ఇది ప్రభుత్వ హత్యల పాలన.. ఆసుపత్రి ఐసీయూలోకి దుండగులు ప్రవేశించడం మామూలా? బీహార్లో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా?’ అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. ఇటీవలే బీజేపీ నేతలు గోపాల్ ఖేమ్కా, సురేంద్ర కుమార్, లాయర్ జితేంద్ర మహతోలు వరుసగా హత్యకు గురయ్యారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా ఘటనపై బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా స్పందిస్తూ ‘"ఇది దారుణమైన ఘటన. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తాం. నేరస్తులను కఠినంగా శిక్షిస్తాం.. నిందితులు తప్పించుకోలేరని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు’ అన్నారు. అయితే, గతంతో పోల్చితే రాష్ట్రంలో ఇప్పుడు నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ వినయ్ కుమార్ చెప్పడం గమనార్హం. 2004లో రోజుకు సగటున 4 హత్యలు జరిగేవని, 2023లో ఈ సంఖ్య 2,700కు తగ్గిందని, ప్రస్తుతం ఇది 1,300లని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa