ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా మీడియాకు చేతికి ఎయిరిండియా పైలట్ల చివరి సంభాషణ.. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంతో కలకలం

national |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 07:37 PM

గత నెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై అమెరికా మీడియా నివేదిక భారత్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇంజిన్‌కు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ఆరోపించింది. ఈ కథనంపై విమానయాన శాఖ, పైలట్ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దర్యాప్తు పూర్తికాకుండానే ముందుగానే ఓ నిర్దారణకు రావడం సరికాదని, పైలట్లపై నిందలు మోపడాన్ని ఆక్షేపిస్తున్నాయి.


వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంధన సరఫరా స్విచ్‌లు రెండూ వరుసగా ఒక సెకను వ్యవధిలో ఆగిపోయాయి. టేకాఫ్‌ తర్వాత కేవలం 32 సెకన్లలోనే విమానం కుప్పకూలిందని పేర్కొంది. కాప్‌పీట్‌లో పైలట్ల మధ్య జరిగిన చివర సంభాషణ కూడా వాల్‌స్ట్రీట్ జర్నల్‌ యాక్సెస్ చేసింది. కెప్టెన్ సుమీత్ సబర్వాల్‌ను ఫస్ట్ ఆఫీసర్ కుందర్ ‘స్విచ్‌లను ఎందుకు మార్చారు?’ అని ప్రశ్నించగా.. కెప్టెన్ మాత్రం మౌనంగా ఉండిపోయారని నివేదిక తెలిపింది. కాగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఇంజిన్లు ఫెయిల్, నిర్వహణలోపం కారణం కాదని ఎయిరిండియా సీఈఓ విల్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


పైలట్ల సంఘం ప్రతినిధులు ప్రాథమిక నివేదికను విడుదల చేసిన తీరును తప్పుబడుతున్నారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లోని కొన్ని విషయాలనే బయటపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది పైలట్ల తప్పని చూపేలా ఉందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదని, ప్రజలు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని పైలట్ల సంఘం కోరుతోంది.


సమగ్ర దర్యాప్తు జరపకుండానే నిందలు వేయడం సరికాదని పైలట్ల సంఘం తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు శిక్షణ పొందిన సిబ్బంది నైపుణ్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. వారి కుటుంబ సభ్యులను కూడా బాధిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. "పైలట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను దర్యాప్తు నుంచి దూరంగా ఉంచడంపై మా అసంతృప్తిని తెలియజేశాం. ప్రాథమిక నివేదికను అన్వయించడం, దానిని బహర్గతం చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం" అని పైలట్ల సంఘం తెలిపింది. ఎయిరిండియా ప్రమాద ఘటనపై ఎయిర్‌‌క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక అందజేసిన విషయం తెలిసిందే.


ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎయిర్‌లైన్‌ పైలట్స్‌ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించింది. ప్రాథమిక నివేదికలో సమాధానాలు ఉండవని, ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుందని పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని సూచించింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక కథనంపై ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎయిర్‌లైన్‌ పైలట్స్‌ తప్పుబట్టింది. "దర్యాప్తు పూర్తయ్యేవరకు సంయమనం పాటించాలని కోరింది.


ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రయాణికులతో పాటు కూలిన హాస్టల్ భవనంలోని మెడికల్ విద్యార్థులు సహ 273 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. అటు మీడియా కథనాలపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ‘‘"ఇది కేవలం ప్రాథమిక నివేదిక ఆధారంగా వచ్చిన కథనం మాత్రమే. తుది నివేదిక రాకముందే తొందరపాటు నిర్ణయాలు సరికాదు.. ’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa