ఫేక్ డబ్బా కొట్టుకున్న పాకిస్థాన్ మీడియాకు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. ఎందుకంటే.. "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్లో పర్యటించబోతున్నారు" అంటూ పాక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, వైట్ హౌస్ అధికారులు దీన్ని ఖండించడమే కాదు, "అసలు అలాంటి ప్లానే లేదు అని..! ట్రంప్ పాకిస్థాన్ పర్యటన అసలు షెడ్యూలే కాలేదు" అని ఘాటుగా స్పందించారు. ఈ ఒక్కమాటతో పాకిస్థాన్ మీడియా పరువు గంగపాలైపోయింది. గత నెలలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్ హౌస్లో ట్రంప్తో కలిసి లంచ్ భేటీలో పాల్గొన్న తర్వాత పాక్ మీడియా చెలరేగడం మొదలుపెట్టింది.
క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు వస్తున్నారు. అయితే ట్రంప్ ముందుగా తమ దేశానికి వస్తారని, ఆ తర్వాత ఇండియా వెళ్తారని పాకిస్థాన్లోని కొన్ని స్థానిక టీవీ ఛానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ‘‘ట్రంప్ సెప్టెంబర్లో ఇస్లామాబాద్కి వచ్చేస్తున్నారహో’’.. అని డప్పు వేసుకున్నాయి. ఈ వార్తలు పాకిస్థాన్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ చిల్లర ప్రచారాన్ని అమెరికా ఏమాత్రం సహించలేదు. వెంటనే రంగంలోకి దిగి, "ప్రస్తుతానికి పాకిస్థాన్ పర్యటన షెడ్యూల్ అవ్వలేదు’ అని ANIకి స్పష్టం చేసింది.
పాకిస్థానీ న్యూస్ అవుట్లెట్లు నివేదించినట్లుగా వైట్హౌస్ ఎటువంటి ప్రయాణ ఏర్పాట్లనూ ప్రకటించలేదని లేదా ధ్రువీకరించలేదని తేల్చి చెప్పింది. ఈ కౌంటర్తో, ఆ వార్తా ఛానెళ్లు తమ నివేదికలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ కూడా "ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు" ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ మీడియా పుకార్లు షికార్లు చేస్తుంటే, వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ట్రంప్ విదేశీ పర్యటన వివరాలను బయటపెట్టారు. ట్రంప్ జూలై 25 నుంచి జూలై 29 వరకు స్కాట్లాండ్లో పర్యటిస్తారు. అక్కడ టర్న్బెర్రీ, అబెర్డిన్ లను సందర్శిస్తారు. ఈ పర్యటనలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ మళ్లీ సమావేశమై, అమెరికా, యూకే మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని మరింత మెరుగుపరచడానికి చర్చలు జరుపుతారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ట్రంప్కి నిజంగా అపూర్వమైన రెండో స్టేట్ విజిట్ అవుతుంది. విండ్సర్ క్యాజిల్లో కింగ్ చార్లెస్తో భేటీ కోసం ట్రంప్ ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారని లీవిట్ తెలిపారు.
అయితే... పాకిస్థాన్ తమ హోదాను పెంచుకునేందుకు... అమెరికాతో స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తునే ఉంది. కానీ... చివరిసారిగా 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పాకిస్థాన్ను సందర్శించిన తర్వాత.. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడెవరూ పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టలేదు. అలాంటిది.. పదేళ్ల తర్వాత ట్రంప్ వస్తున్నాడని పాక్ మీడియా డప్పు కొట్టుకోవటం తీవ్ర చర్చనీయాంశమైంది. వైట్ హౌస్ అసలు విషయం చెప్పడంతో పాకిస్థాన్ మీడియా సైలెంట్ అయిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa