ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీటీల పేరుతో మోసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 12:06 PM

విజయవాడ  నగరంలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్లుగా చీటీలు వేస్తూ స్థానికంగా నమ్మకాన్ని సంపాదించుకున్న మహిళ ఒక్కసారిగా ఖాతాదారులకు షాక్‌ ఇచ్చింది. ఈ ఘటన రామలింగేశ్వరనగర్‌లో శనివారం బయట పడింది. వివరాల్లోకి వెళితే.. రామలింగేశ్వరనగర్‌ గాయత్రీ రోడ్డులోని గంగానమ్మ ఆలయ ప్రాంతానికి చెందిన యలమంద కోటేశ్వరమ్మకు సొంతిల్లు ఉంది. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి.. కుటుంబంతో కలిసి శివశంకర్‌ రోడ్డులో అద్దెకు ఉంటోంది. ఆమె భర్త వెంకటేశ్వరరావు ఆర్టీసీలో ఉద్యోగి. కోటేశ్వరమ్మ కొన్నేళ్లుగా చీటీలు నిర్వహిస్తోంది. చుట్టుపక్కల వీధుల్లో ఉన్నవారు ముందుగా ఆమె వద్ద సభ్యులుగా చేరుతారు. తర్వాత వారి స్నేహితులను చీటీల్లో చేర్పిస్తారు. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల చీటీలను కోటేశ్వరమ్మ నిర్వహిస్తోంది. కొంతకాలంగా చీటీలు పాడుకున్న వారికి, చీటీలు పూర్తయ్యే వరకు ఉన్నవారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. బాధితులు ఇంటి చుట్టూ తిరుగుతున్నా రేపుమాపూ అంటూ వాయిదాలు వేస్తోంది. కాగా, శుక్రవారం నుంచి కోటేశ్వరమ్మ ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయింది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. సొంతింట్లో ఉన్న ఆమె తమ్ముడు, తల్లిని అడిగితే తమకేమీ తెలియదని చెబుతున్నారు. ఆమె చీటీల పేరుతో రూ.5 కోట్లకు పైగానే వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. కోటేశ్వరమ్మ బాధితులు 100-150 మంది వరకు ఉండొచ్చని అంచనా. బాధితులు శనివారం ఆమె ఇంటికి వెళ్లగా కనిపించలేదు. దీంతో అక్కడ ఆందోళన చేశారు. అక్కడి నుంచి డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పటమట పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ వెళ్లి మొత్తం వివరాలు సేకరించారు. కోటేశ్వరమ్మపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa