ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై అదుపుతప్పిన ఎయిరిండియా విమానం

national |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 06:21 PM

ఎయిరిండియాకు చెందిన మరో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కొచ్చి నుంచి ముంబయికి చేరుకున్న ఎయిరిండియా విమానం AI2744 విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్కకు జారిపోవడంతో కలకలం రేపింది. భారీ వర్షం కారణంగా రన్‌వేపై నుంచి విమానం అదుపు తప్పింది. ఈ ఘటనలో విమానానికి నష్టం వాటిల్లింది. ప్రయాణికులు, సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారీ వర్షం కురుస్తుండటంతో విమానం రన్‌వేపై అదుపు తప్పింది. వెంటనే స్పందించిన సహాయక బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికులను, సిబ్బందిని క్షేమంగా కిందకు దించాయి. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్, మూడు టైర్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అలాగే, రన్‌వే కొంతమేర ధ్వంసం అయింది.


దీంతో ఇతర విమానాల ల్యాండింగ్ కోసం సెకండరీ రన్‌వేను ఉపయోగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానాన్ని తనిఖీల కోసం వేరే చోటికి తరలించారు. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ధ్వంసమైన రన్‌వేను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. "భారీ వర్షం కురవడంతో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది" అని అధికారులు పేర్కొన్నారు. రన్‌వేను త్వరగా మరమ్మతు చేసి విమానాల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. గత నెలలో అహ్మదాబాద్ లండన్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానాల్లో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.


‘‘కొచ్చి నుంచి వచ్చిన విమానం ఉదయం 9:27 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే నుంచి పక్కకు జారింది.. వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు’’ అని తెలిపింది. ప్రయాణికుల భద్రతే మా తొలి ప్రాధాన్యత అని విమానాశ్రయ అధికారులు పునరుద్ఘాటించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని విమానాశ్రయాల్లో రన్‌వేలు, భద్రత ప్రమాణాలపై డీజీసీఏ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.


మరోవైపు ఉదయం నుంచి కుండపోత వర్షాలతో ముంబయి నగరం అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు జలమయమవ్వడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో విమాన ప్రయాణికులకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘‘ఈ రోజు (జులై 21న) వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రయాణికులు తమ విమానాల సమాచారం ముందుగానే తమ సంస్థలతో సంప్రదించి తెలుసుకొని, సాధారణ సమయానికి కంటే ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచిస్తున్నాం’’ అని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa