ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దన్ఖడ్ రాజీనామా

national |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 11:28 PM

ఉపరాష్ట్ర పతి జగదీప్ దన్ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్టు జగదీప్ దన్ఖడ్ వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దన్ఖడ్‌కు పంపారు. 2022 జులైలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దన్ఖడ్ విజయం సాధించారు. అదే ఏడాది ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉన్నారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతోన్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్న ఆయన.. ఈ పదవిలో కొనసాగలేనని పేర్కొన్నారు. తన స్థానంలో వేరొకరికి బాధ్యతలు కట్టబెట్టాలని సూచించారు. తనకు అవకాశం కల్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే, పదవీకాలం ఉండగానే వైస్-ప్రెసిడెంట్‌‌ పదవి నుంచి తప్పుకున్న రెండో వ్యక్తిగా జగదీప్ దన్ఖడ్ నిలిచారు.


కాగా, 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా ఉన్న జగదీప్ దన్ఖడ్.. 2003లో బీజేపీలో చేరారు. 1979 నుంచి 90 మధ్య రాజస్థాన్ హైకోర్టు లాయర్‌గా ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ముందు 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్‌గా కొనసాగారు. ఆ సమయంలో మమతా బెనర్జీ, గవర్నర్ దన్ఖడ్ మధ్య ఘర్షణ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజ్‌భవన్ కేంద్రంగా రాజకీయాలను నడిపి వివాదాల్లో ఇరుక్కున్నారు.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సోమవారం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై జగదీప్ దన్ఖడ్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీలకు గట్టి సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అంటే.. పదేపదే అభ్యంతరకర వ్యాఖ్యలు, పరస్పర దూషణలు కాకుండా, పరస్పర గౌరవంతో కూడిన రాజకీయ సంస్కృతి అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ‘రాజకీయ ప్రతిస్పర్ధ వాస్తవికమే అయినా, రాజకీయాలు అంటే ఎదురుదెబ్బలు కాదు. దేశ ప్రయోజనాల విషయంలో ఎవరూ విభేదించరని నేను నమ్ముతాను’అని ఆయన చెప్పారు. రాజకీయ కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.


అయితే, ఉప-రాష్ట్రపతి పదవిలోనూ ఆయన వ్వవహారశైలిపై తీవ్ర దుమారం రేపింది. ఆయన అభిశంసనకు విపక్షాలు నోటీసుకు ఇచ్చాయి. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాసం ఇవ్వడం ఆ తొలి వ్యక్తి ధన్ఖడ్ కావడం గమనార్హం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఆయన బీజేపీకి ఏజెంటులా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa