క్రికెట్లో పాకిస్తాన్ రోజురోజుకూ దిగజారిపోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో దారుణంగా విఫలమై తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. పాకిస్తాన్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయిన ఆ జట్టు.. ఆ తర్వాత కూడా ఏ మాత్రం మారలేదు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో కేవలం 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మరోసారి ప్రపంచ క్రికెట్ ముందు పరువు పోగొట్టుకుంది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. టెయిలెండర్స్ మ్యాచ్ని ముందుకు నడిపించి ఆఖరి ఓవర్లో చేతులెత్తేశారు.
ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్ జట్టును పాకిస్తాన్ బౌలర్లు 20 ఓవర్లలో కేవలం 133 పరుగులకే కట్టడి చేశారు. కెప్టెన్ లిట్టన్ దాస్తో పాటు టాప్ ఆర్డర్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాట పట్టింది.
జకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్ మిడిలార్డర్లో రాణించారు. జకీర్ అలీ 48 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. మెహదీ హసన్ 25 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా, అహ్మద్ డేనియల్, అబ్బాస్ అఫ్రిదీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
బంగ్లాదేశ్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఐదు ఓవర్లు కూడా పూర్తి కాకముందే పాకిస్తాన్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఫకర్ జమాన్ 8, సైమ్ ఆయూబ్ 1, మహమ్మద్ హారీశ్ 0, సల్మాన్ అఘా 9, హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్ డకౌట్లు అయ్యారు. దాంతో పాక్ 30 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో 50 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ ఫాహీమ్ అష్రఫ్, అబ్బాస్ అఫ్రిది పాక్ పరువును కాపాడారు.
ఖుష్దిల్ షా 13 పరుగులు చేసి అవుటైన తర్వాత పాకిస్తాన్ 47 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఫాహీమ్ అఫ్రఫ్, అబ్బాస్ అఫ్రిదీ ఎనిమిదో వికెట్కు 41 పరుగులు జోడించారు. అబ్బాస్ (19) అవుటైన తర్వాత అఫ్రఫ్ వీరోచితంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఏడు బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన సమయంలో రిషద్ హోసెన్ బౌలింగ్లో అష్రఫ్ బౌల్డ్ అయ్యాడు. 32 బంతులు ఆడిన అష్రఫ్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో బౌలింగ్కి వచ్చిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండో బంతికే డేనియల్ను అవుట్ చేశాడు. దాంతో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa