ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 05:04 PM

డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన పాల్గొని, ఎఐ మరియు డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మాట్లాడారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఏఐ సాంకేతికత అభివృద్ధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ)ని ఆదర్శంగా తీసుకుంటున్నామని, ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశం యుఎఈ అని లోకేశ్ గుర్తు చేశారు. యుఏఈ సహకారంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సదస్సులో యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల్ మరితో మంత్రి లోకేశ్ సమావేశమై, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ గవర్నెన్స్, ఎఐ ఫస్ట్ యూనివర్సిటీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఈ రంగాల్లో సహకారం అందించాలని యుఏఈని కోరగా, అబ్దుల్ బిన్ సానుకూలంగా స్పందిస్తూ లోకేశ్ ను యుఏఈ పర్యటనకు ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa