ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. పాకిస్తాన్‌కు సీడీఎస్ జనరల్ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 07:54 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి.. ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని.. పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలని.. రెచ్చగొట్టే చర్యలకు దిగకపోతేనే దాయాది దేశానికి మంచిదంటూ అనిల్ చౌహాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి ఎలాంటి దుందుడుకు చర్యలు ప్రారంభం అయినా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి ఈ సందర్భంగా ఆయన సూచించారు.


ఢిల్లీలో శుక్రవారం జరిగిన డిఫెన్స్ సెమినార్‌లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. ఇందుకు తగ్గట్టుగా బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని చెప్పుకొచ్చారు. భారత్‌ 365 రోజులూ, 24 గంటలూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ హెచ్చరించారు. ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ పూర్తిగా అప్‌డేట్‌ అయి ఉండాలని అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో యుద్ధాల గతి మారిపోతోందని సీడీఎస్‌ వెల్లడించారు. భవిష్యత్తులో.. దళాల్లో సమాచార-సాంకేతికతో పాటు స్కాలర్‌ వారియర్స్‌ కలగలిసి ఉంటాయన్నారు.


ఈ సందర్బంగా అనిల్ చౌహాన్ మాట్లాడుతూ... నేటి కాలం యుద్దాల్లో రెండో స్థానం ఉండదని.. కేవలం విజేత మాత్రమే ఉంటారన్నారు. అందుకే దళాలు అప్రమత్తంగా ఉంటూ.. ఏ క్షణమైనా.. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్‌ సిందూరే దీనికి ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. రక్షణ రంగ సాంకేతికతలో ఇండియా చాలా మెరుగైన స్థాయిలో అభివృద్ధి సాధించిందన్నారు. భవిష్యత్తులో భారత సైన్యానికి ఇన్ఫర్మేషన్‌ వారియర్స్‌, టెక్నాలజీ వారియర్స్‌, స్కాలర్‌ వారియర్స్‌ అవసరం ఎక్కువగా ఉండబోతుందని సీడీఎస్ చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల ఆధారంగా.. భవిష్యత్తు తరాల్లో ఆర్మీలో ఉండబోయే సైనికులు.. ఈ మూడు నైపుణ్యాల కలబోతగా ఉంటారని అనిల్ చౌహాన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనం సైనిక దళాల్లో జరుగుతున్న మార్పుల మూడో విప్లవం కీలక దశలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీనిని తాను కన్వర్జెన్సీ యుద్ధంగా అభివర్ణిస్తానని తెలిపారు.


ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ క్రమంలో రావల్పిండి, పీవోకేతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఘర్షణల్లో పాకిస్తాన్‌కు చెందిన ఆరుకు పైగా వైమానిక స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే గొడవలు ముగిసి రెండు నెలలు దాటినా వాటి మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa