ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తులకు కూడా ఆటో మ్యుటేషన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ఆస్తులు అక్రమంగా మార్చుకోవడానికి, అలాగే అవినీతి పనులకు కూడా అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆస్తులకు ఆటోమ్యుటేషన్ విధానం అనుసరించనున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే విజయవాడలో అమలుచేయగా.. అక్కడ సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలోనూ ఆగస్ట్ ఒకటి నుంచి ఆస్తులకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్నిచోట్ల సిబ్బందికి ఆటో మ్యుటేషన్ గురించి అవగాహన కూడా కల్పిస్తున్నారు.
ఆస్తులకు ఆటోమ్యుటేషన్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తికావటంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకూ ఆస్తుల మ్యుటేషన్ (ఆస్తుల బదలాయింపు) కోసం సుదీర్ఘమైన ప్రక్రియ ఉండేది. ఆస్తులు కొనుగోలు చేసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం కార్పొరేషన్ ఆఫీసులో ఇంటి పన్ను, కులాయి పన్ను రశీదుల్లో పేరు మార్పు కోసం మ్యుటేషన్ ఫీజుగా చలానా చెల్లించాలి.
ఆ తర్వాత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇదంతా పూర్తై.. సచివాలయంలో డాక్యుమెంట్లు పొందుపరచిన అనంతరం.. ఆర్ఐ, ఆర్వో లాగిన్, ఆ తర్వాత కమిషనర్ లాగిన్ వద్దకు దరఖాస్తు చేరుతుంది. ఈ సుధీర్ఘ ప్రక్రియ పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది. వాస్తవానికి 14 రోజులలో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి కావాలని నిబంధనలు చెప్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
అయితే ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆటో మ్యుటేషన్ విధానంతో ఈ సమస్యలు తప్పనున్నాయి. కార్పొరేషన్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఆటో మ్యుటేషన్ విధానంలో.. ఆస్తుల కొనుగోలు తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే ఆస్తి విలువలో ఒక శాతం చలానా కడితే.. రిజిస్ట్రార్ ఆఫీసులోనే మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో పూర్తి కాగానే.. ఆ డాక్యుమెంట్లు ఆటోమేటిగ్గా కమిషనర్ లాగిన్కు చేరతాయి. కమిషనర్ ఓకే చేసిన వెంటనే.. ఎవరైతే ఆస్తిని కొనుగోలు చేసిన యజమాని ఉంటారో ఆయన పేరుపైకి చేరిపోతుంది. దీంతో సమయం ఆదా కావటంతో పాటుగా కార్పొరేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని.. అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa