వైఎస్సార్ కడప జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తరుణం సమీపిస్తోంది. కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు విషయం చాలా రోజుల నుంచి నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సున్నపురాళ్లపల్లెలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ.. ఏపీ పారిశ్రామికాభివృద్ధి పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాలని, చర్యలు తీసుకోవాలని విద్యుత్, పరిశ్రమలు, జలవనరులు, రెవెన్యూ, ఆర్ధిక శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. రూ.4,500 కోట్లతో సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ప్లాంట్ తొలి దశ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.11,850 కోట్లతో స్టీల్ ప్లాంట్ రెండో దశ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
మరోవైపు సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జేఎస్డబ్ల్యూ సంస్థకు ఏపీ ప్రభుత్వం 1100 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఎకరా రూ. 5లక్షల చొప్పున ఈ భూమిని కేటాయించింది. 2026 జనవరి నాటికి కడప స్టీల్ప్లాంట్ తొలి దశ పనులు ప్రారంభించాల్సి ఉంది. అలాగే 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇక 2029 ఏప్రిల్ సమయానికి స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజాగా జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపటంతో సకాలంలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న జేఎస్డబ్ల్యూ సంస్థకు ప్రోత్సాహకాలు ఇవ్వటంతో పాటుగా విద్యుత్, నీరు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మరోవైపు సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులను 2031 జనవరి నాటికి మొదలుపెట్టనున్నారు. 2034 ఏప్రిల్ వచ్చేసరికి స్టీల్ప్లాంట్లో రెండో దశలోనూ ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014లోని 13వ షెడ్యూల్ ప్రకారం కడప స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశలలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో ఒక మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని.. రెండో దశ కల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 2 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం జేఎస్డబ్ల్యూ సంస్థకు 1100 ఎకరాల భూమిని 33 సంవత్సరాలు లీజుకు ఇచ్చారు.
ఇక కడప స్టీల్ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే పలుసార్లు శంకుస్థాపనలు చేశారు. 2023లో జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ భూమి పూజ చేసింది. తాజాగా జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపటంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశ నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా 3,200 మందికి, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి అవకాశాలు.లభిస్తాయని అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa