కరోనా అంటే కోవిడ్ -19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోవిడ్ -19 ముప్పు తగ్గినా దాని ప్రభావం ఇప్పటికీ కూడా తగ్గడం లేదు. కోవిడ్ -19, లాక్ డౌన్ పరిస్థితులు మన మెదడుల్ని వేగంగా మొద్దు బారేలా అంటే వృద్దాప్యం బారిన పడేలా చేశాయని లేటెస్ట్ రీసెర్చ్ తెలిపింది. ఈ విషయాన్ని నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన కొత్త అధ్యయనం తెలిపింది. వైరస్ మాత్రమే కాకుండా లాక్డౌన్లో అనుభవించిన ఒత్తిడి, ఒంటరితనం, మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందని ఈ అధ్యయనం చూపిస్తుంది.
అధ్యయనం ఏం చెప్పిందంటే
మహమ్మారికి ముందు అధ్యయనం చేసిన వారి మెదడులతో పోలిస్తే ఆ తర్వాత వారి బ్రెయిన్స్.. దాదాపు 5.5 నెలలు వేగంగా వయసు పెరిగాయని స్కాన్లు చూపించాయి. పురుషులు, వృద్ధులు, తక్కువ ఇమ్యూనిటీ పవర్, ఆదాయం తక్కువ ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు UK బయోబ్యాంక్ (UKBB) అధ్యయనం నుంచి సీరియల్ న్యూరో-ఇమేజింగ్ డేటాతో పాటు మహమ్మారికి ముందు, తరువాత మెదడు స్కాన్లను ఉపయోగించారు.
"ఈ అధ్యయనం మెదడు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది," అని గురుగ్రామ్లోని పరాస్ హెల్త్, న్యూరాలజీ చైర్పర్సన్ డాక్టర్ ఎంవి పద్మ శ్రీవాస్తవ చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో మెదడు వృద్ధాప్యం వేగవంతమైందని అధ్యయనం కనుగొంది. కరోనా సోకని వ్యక్తుల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది. దీని అర్థం ఈ మార్పులు వైరస్ వల్ల మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ అనుభవించిన ఒత్తిడి, ఒంటరితనం, రోజువారీ జీవితంలో అంతరాయం వల్ల కూడా సంభవించాయి. ఇది మన మానసిక, భావోద్వేగ వాతావరణం మెదడు ఆరోగ్యాన్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది.
భవిష్యత్తులో కూడా ఇలా జరుగుతుందా?
మహమ్మారి సమయంలో మెదడు వృద్ధాప్యం వేగవంతం అయ్యే సంకేతాలను అధ్యయనం గమనించినప్పటికీ.. ఇది దీర్ఘకాలిక మెదడు ఆరోగ్య సమస్యలను నిర్ధారించలేదు. అయితే, మెదడు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. రోజువారీ ఒత్తిడిని తగ్గించడం, సామాజికంగా కనెక్ట్ అవ్వడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.
మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒత్తిడిని నిర్వహించడం, శారీరకంగా చురుకుగా ఉండటం, తగినంత నిద్రపోవడం, సామాజిక సంబంధాలను కొనసాగించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి పనుల ద్వారా మీ మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్గా వ్యాయామం చేయం వల్ల అబిజ్ఞా పనితీరును పెంచుతాయి. పజిల్స్, చదవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మీ మెదడుకు వ్యాయామం ఇవ్వండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa