వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఈ తేమ వాతావరణంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇక, పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. పిల్లల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వర్షాకాలంలో వాళ్లు ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో బాధపడుతుంటారు. మారుతున్న వాతావరణం కారణంగా పిల్లలకు జ్వరం ఎక్కువగా వస్తుంది. అయితే, పిల్లల జ్వరాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు తెలిసో లేదా తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. ఈ పనుల వల్ల వారి పరిస్థితి మరింత దిగజారవచ్చని పిల్లల డాక్టర్ అర్పిత్ గుప్తా అన్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. పిల్లలకు జ్వరమొచ్చినప్పుడు తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం.
వెచ్చని బట్టలు వేయడం
పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే. పిల్లలకి జ్వరం రాగానే ఇంట్లో ఉన్న స్వెటర్, టోపీ పెట్టడం లేదా దుప్పటి కప్పుతుండటం చేస్తుంటారు. అయితే, పెద్ద తప్పు అంటున్నారు డాక్టర్ అర్పిత్ గుప్తా. పిల్లలకి వెచ్చని దుస్తులు వేయడం వల్ల శరీరం వేడి పెరుగుతుంది. దీంతో.. జ్వరం ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్ అంటున్నారు. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి కాటన్ దుస్తులు వేయడం మంచిది అంటున్నారు. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వచ్చేదాకా బట్టల్ని కాస్తా ఫ్రీగా ఉంచండి. అంటే బటన్స్ ఓపెన్ చేసి ఉంచండి.
తలపై కోల్డ్ కంప్రెస్ అసలు వద్దు
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు చాలా మంది వారి తలపై చల్లని గుడ్డ లేదా రుమాలు ఉంచుతారు. చాలా మంది చల్లని నీటితో ఇలా చేస్తారు. అయితే, ఇది మేలు చేయకపోగా.. హాని కలిగించవచ్చని డాక్టర్ అంటున్నారు. డాక్టర్ అర్పిత్ ప్రకారం రుమాలు లేదా గుడ్డను ఉపయోగిస్తే.. అది గోరువెచ్చని నీటితో అయి ఉండాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జ్వరం కూడా తగ్గుముఖం పడుతుందని డాక్టర్ అంటున్నారు. అంతేకానీ.. చల్లని రుమాలు లేదా గుడ్డ ఉంచడం ప్రమాదం.
బలవంతంగా తినిపించడం
జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఆకలి తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో వారికి బలవంతంగా తినిపించడం లాంటి పనులు చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు డాక్టర్ అర్పిత్. బలవంతంగా తినాలనిపించడం వల్ల పిల్లలకు వాంతులవ్వడం లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. బదులుగా వారికి సూప్, పప్పు నీరు, కొబ్బరి నీరు, ORS వంటి ద్రవాలు ఇవ్వండి. దీంతో శరీరంలో నీటి కొరత ఉండదు. అంతేకాకుండా పిల్లలు కూడా బలహీనంగా మారరని డాక్టర్ సూచిస్తున్నారు.
డాక్టర్ అర్పిత్ చెప్పిన జాగ్రత్తలు
ఫ్యాన్ లేదా ఏసీని ఆపడం
ఈ తప్పు కూడా మనలో చాలా మంది చేస్తూ ఉంటాం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు చాలా మంది ఫ్యాన్ లేదా ఏసీని ఆపేస్తారు. పిల్లల్ని చలి నుంచి రక్షించాలని భావించి ఇలా చేస్తుంటారు. అయితే, ఇది కరెక్ట్ పద్ధతి కాదని డాక్టర్ అర్పిత్ గుప్తా అంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు పిల్లల గదిలో ఫ్యాన్ లేదా ఏసీని ఆపివేయవద్దని వైద్యులు అంటున్నారు. గది వేడిగా ఉండనివ్వకండి.. గాలి వీస్తూ ఉండాలి. దీంతో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా ఏసీని లేదా ఫ్యాన్ గాలి డైరెక్టుగా పిల్లలకు తగిలేలా పెట్టకండి.
మందులు ఇవ్వడంలో జాగ్రత్త
తల్లిదండ్రులు భయపడి పిల్లలకు తొందరపడి మందులు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది అధిక మోతాదుకు దారితీస్తుంది. ఎల్లప్పుడూ వైద్యుల సలహా మేరకు మందులు ఇవ్వండి. పిల్లల బరువు ప్రకారం సరైన పరిమాణాన్ని ఇవ్వండి. జ్వరం తగ్గించడానికి వెంటనే మందులు ఇచ్చే బదులు, కొంత సమయం వేచి ఉండండి. గోరువెచ్చని నీటిలో రుమాలు ఉంచి వారి తలపై ఉంచి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చేయండి. డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల శరీర రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa