ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఉద్యోగం గ్యారెంటీ అన్నట్లు ఏం ఉండదు. అంటే జాబ్ సెక్యూరిటీ ఉండదన్నట్లు. కచ్చితంగా ఇంత కాలం చేస్తా అంటే కుదరదు. యాజమాన్యం నిర్ణయాన్ని బట్టి మీ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేది ఉంటుంది. కంపెనీ అవసరాల్ని బట్టి తీసుకొని.. వాళ్ల అవసరం లేనప్పుడు తీసేయొచ్చు. ఇక ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక మాంద్యం భయాల్ని పెంచుతుంది. ముఖ్యంగా ట్రంప్ సుంకాలు ఇటీవల భయపెడుతున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో.. చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ముఖ్యంగా ఐటీ/టెక్ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
ఇటీవల భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కూడా అంతర్జాతీయంగా 12 వేల మందికిపైగా తీసేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై దుమారమే రేగుతోంది. అందుకే ఉద్యోగ భద్రత అనేది అత్యంత ముఖ్యం. ఇక ఉద్యోగ అభద్రత మానసిక, భావోద్వేగ ఒత్తిడికి దారితీస్తుంది. సడెన్ లేఆఫ్స్ సమయంలో ఇది ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఒక్కసారిగా స్థిర ఆదాయం కోల్పోతుంటే నిద్రలేమి, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, అప్పులు పెరిగిపోవచ్చు. అందుకే వీటి బారిన పడకుండా ఉండేందుకు ముందుగానే సిద్ధపడాలి. ఇందుకోసం ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి.
దీనినే అత్యవసర నిధి అంటారు. ఇది మీకు అత్యవసరాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగం పోయినా.. ఆస్పత్రి ఖర్చుల కోసం.. ఇతర ఊహించని ఖర్చులకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ముందునుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకొని.. స్థిరంగా పొదుపు చేసుకుంటూ పోతే పెద్ద మొత్తంలో ఫండ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
>> ఇక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు అనేది మీ సంపాదన, జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీకు 3-6 నెలల వరకు అన్ని అవసరాల్ని, ఖర్చుల్ని తీర్చేదిగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఉదాహరణకు నెలకు రూ. 80 వేల వరకు ఖర్చులు ఉన్న వారికి.. రూ. 10 లక్షల వరకు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం పడుతుందని చెబుతున్నారు.
మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉండాలి అంటే.. నగదు రూపంలో మొత్తం ఉండటం సరికాదంటున్నారు. మరి ఏమంటున్నారో చూద్దాం. లిక్విడిటీ, భద్రత రెండూ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం అత్యంత ఆదరణ పొందిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ సగటున 6-7 శాతం రాబడి వస్తుంది. స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. వీటిల్లో మనకు డబ్బు వెంటనే అందుతుంది.
సేవింగ్స్ అకౌంట్ వడ్డీ తక్కువ..
>> మీరు ఎమర్జెన్సీ ఫండ్ నగదు త్వరగా రావాలంటే సేవింగ్స్ అకౌంట్లోనే ఉంటేనే సేఫ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ సేవింగ్స్ అకౌంట్లో మొత్తం ఉంచడం మంచిది కాదు. ఇక్కడ వడ్డీ చాలా తక్కువగా (2.5-3.5 శాతం) ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని మించే రాబడి ఇవ్వదు. ఒక నెల ఖర్చులు సేవింగ్స్ అకౌంట్లో.. మిగతాది లిక్విడ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, స్వీప్ ఎఫ్డీల్లో ఉంచాలి.
రూ. 10 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించడం అంత తేలికేం కాదు. ఇక్కడ చాలా సమయం పడుతుంది. ఇంకా ఆర్థిక క్రమశిక్షణ కావాలి. నెలవారీ సిప్లను లిక్విడ్ ఫండ్ లేదా ఆర్డీల్లోకి పంపించడం ద్వారా నిధి వేగంగా నిర్మించొచ్చు. ఉదాహరణకు నెలకు రూ. 20 వేలను 6 శాతం వార్షిక రాబడి ఇచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే.. నాలుగేళ్లలో రూ. 10 లక్షలు సృష్టించొచ్చు.
ఇక మీ ఆర్థిక స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు దీనిని సమీక్షించుకుంటూ ఉండాలి. అవసరాలు, ఖర్చులు, పొదుపు అన్నీ సమీక్షించుకోవాలి. మీకు బోనస్ వచ్చినా.. జీతం పెరిగినా.. ఇతర వాటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చూడాలి. ఇంకా సిప్ మొత్తం పెంచుకోవచ్చు. అప్పుడు కాస్త త్వరగానే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa