మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ఖగోళ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వినాయక నిమజ్జనం త్వరగా పూర్తి చేసి ఇంటికి చేరుకోవాలని ఆధ్యాత్మికులు సూచిస్తున్నారు.సెప్టెంబర్ 7న హైదరాబాద్లో కనిపించే చంద్రగ్రహణం సంపూర్ణంగా, స్పష్టంగా దర్శనమివ్వనుంది. సూతకాలం మొదలయ్యే సమయం కూడా దగ్గరపడుతోంది.శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు. అందుకే దీనిని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు. చంద్రగ్రహణం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, అర్థరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది. మొత్తం వ్యవధి దాదాపు 3 గంటలు 28 నిమిషాలు ఉంటుంది.శాస్త్రాల ప్రకారం, చంద్రగ్రహణానికి 9 గంటల ముందే సూతకాలం మొదలవుతుంది. అంటే, సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:57 గంటలకు సూతకాలం ప్రారంభమవుతుంది. అప్పటి నుండి గ్రహణ నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.2022 తర్వాత ఇది భారత్లో కనిపించే మరో సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం. మళ్లీ ఇలాంటి అవకాశం 2028 డిసెంబర్ 31న మాత్రమే లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే గీతలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అలా భూమి సూర్యుడు – చంద్రుడు మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు మొదలవుతుంది.ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎటువంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని, కంటితోనే నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపూర్ణ గ్రహణం రాత్రి 11:01 గంటలకు ప్రారంభమై, 12:23 గంటలకు ముగుస్తుంది. అంటే 82 నిమిషాలపాటు ఇది కొనసాగుతుంది. మొత్తం గ్రహణం మాత్రం 8వ తేదీ వేకువజామున 1:26 గంటలకు పూర్తిగా వీడిపోతుంది.భారతదేశంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలు అనేక ఆచారాలను పాటిస్తారు. ఆ సమయంలో ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని నమ్మకం ఉండటంతో, ఆ సమయంలో ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గర్భిణులు, శిశువులకు గ్రహణ ప్రభావం ఉంటుందని భావించి కొన్ని ఆంక్షలు పాటిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa