ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ సంచలన నిర్ణయం

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 11:09 PM

ఆసియాకప్ 2025 సూపర్-4లో భారత్‌తో మ్యాచుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్‌లో ఇరు జట్ల కెప్టెన్‌లు పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ మీడియా కాన్ఫరెన్స్‌ను పాకిస్థాన్ జట్టు బహిష్కరించింది. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో మాత్రం పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొంది.


విలేకరుల సమావేశాన్ని పాకిస్థాన్ ఎందుకు రద్దు చేసిందనదేది.. తెలియలేదు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా పాకిస్థాన్ ఆసియాకప్‌లో మ్యాచుకు ముందు ఇలా.. ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేయడం రెండోసారి. యూఏఈతో మ్యాచుకు ముందు కూడా పాక్ ఇలానే చేసింది. మ్యాచ్ రిఫరీ కొనసాగింపు విషయంలో కొనసాగుతున్న వివాదం మధ్య పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియాకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరిగింది. నిజానికి ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని భారత ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లారు భారత ప్లేయర్లు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రైకాఫ్ట్‌ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అతడిని రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. దీన్ని ఐసీసీ తోసిపుచ్చింది.


దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. కానీ ఆదివారం జరగబోయే మ్యాచ్‌కు సైతం.. ఆండీ ప్రైకాఫ్ట్‌నే కొనసాగించింది. ఈ నేపథ్యంలో శనివారం జరగాల్సిన విలేకరుల సమావేశాన్ని పాకిస్థాన్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. సూపర్-4లో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌‌తో భారత్ తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa