ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఎస్ఏ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేసిన ఐసీసీ

sports |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:02 AM

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన తీవ్ర లోపాల కారణంగా యూఎస్ఏ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం ప్రభావం ఆటగాళ్లపై పడకుండా కీలక చర్యలు చేపట్టింది. అమెరికా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో యథావిధిగా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.గత కొంతకాలంగా యూఎస్ఏ క్రికెట్ బోర్డు పనితీరుపై ఐసీసీ అసంతృప్తితో ఉంది. పాలనాపరమైన నిర్మాణం సరిగ్గా లేకపోవడం, అమెరికా ఒలింపిక్ కమిటీ నుంచి గుర్తింపు పొందడంలో విఫలమవడం, క్రికెట్ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా వ్యవహరించడం వంటి అంశాలను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై 2024 వార్షిక సర్వసభ్య సమావేశంలోనే యూఎస్ఏ క్రికెట్‌కు 12 నెలల గడువు ఇచ్చి హెచ్చరించింది. అయినా వారి పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో, ఐసీసీ బోర్డు సమావేశంలో సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని కఠిన నిర్ణయం తీసుకుంది.2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశించనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒలింపిక్స్‌లో అమెరికా జట్టు భాగస్వామ్యాన్ని, ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. "ఇది దురదృష్టకరమైనా, అమెరికాలో క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తప్పనిసరి చర్య" అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ సస్పెన్షన్ కాలంలో అమెరికా జాతీయ జట్ల నిర్వహణ, పరిపాలన బాధ్యతలను ఐసీసీ లేదా దాని ప్రతినిధులు తాత్కాలికంగా పర్యవేక్షిస్తారు. ఆటగాళ్లకు అవసరమైన మద్దతు అందిస్తూ, వారి అభివృద్ధికి కృషి చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం జట్టు సన్నద్ధతకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa