ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ భారం మీరు మోయద్దు': పైలెట్ తండ్రితో సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 07:25 PM

 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయిన ఈ దుర్ఘటనలో మొత్తంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం.. పైలెట్ కమాండర్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఆయన తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రమాదానికి పైలటే కారణమనే అపవాదును తొలగించాలని పిటిన్ వేశారు. అయితే తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. "ఈ ప్రమాదానికి పైలట్ తప్పు అని దేశంలో ఎవరూ నమ్మడం లేదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


పైలెట్ తండ్రికి ధర్మాసనం సానుభూతి


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు 91 ఏళ్ల పుష్కర్ సభర్వాల్ విచారణకు హాజరు అయ్యారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయన పడుతున్న బాధను అర్థం చేసుకున్న ధర్మాసనం సానుభూతి వ్యక్తం చేసింది. "ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. కానీ మీ కుమారుడిపై నింద మోపబడుతోందనే భారాన్ని మీరు మోయకండి. దీనికి అతన్ని ఎవరూ నిందించలేరు" అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. జస్టిస్ బాగ్చీ జోడిస్తూ.. "దర్యాప్తు నివేదికల్లో ఎక్కడా పైలట్‌ను నిందించే అంశం లేదు. అది కేవలం పైలట్ల మధ్య జరిగిన సంభాషణను మాత్రమే నమోదు చేసింది" అని స్పష్టం చేశారు.


పైలట్ తండ్రి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఈ ప్రమాదంపై కేవలం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే జరిగిందని, రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు అవసరమని వాదించారు. పైలట్ తప్పిదాన్ని పరోక్షంగా సూచించే వార్తాపత్రిక కథనాలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మీడియా కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే, దానికి తగిన ఫోరంలో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.


అయితే న్యాయస్థానం పుష్కర్ సభర్వాల్ అభ్యర్థనను పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సహా ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్రమాద కారణం ఏదైనప్పటికీ.. "దానికి పైలట్ కారణం కాదు" అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 10వ తేదీన జరగనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa