జైపూర్లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటనపై తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపులు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆ బాలిక తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు.
నన్ను బడికి పంపించొద్దూ ప్లీజ్..
నవంబర్ 1వ తేదీన జరిగిన ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్కు వెళ్లనంటూ తమ కుమార్తె ఏడుస్తూ వేడుకున్న ఆడియో క్లిప్ను తల్లి శివాని మీనా మీడియా ముందు విడుదల చేశారు. అందులో బాలిక "నేను పాఠశాలకు వెళ్లాలనుకోవడం లేదు. నన్ను పంపించొద్దు ప్లీజ్" అని బతిమాలడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇదే విషయమై శివాని మీనా మాట్లాడుతూ.. "ఈ ఆడియోను నేను క్లాస్ టీచర్తో పాటు స్కూల్ కో-ఆర్డినేటర్కు పంపించాను. నా కుమార్తె పడుతున్న ఇబ్బందుల గురించి చాలా సార్లు వివరించాను. అయినా వారు నా మాటలు పట్టించుకోలేదు" అని ఆరోపించారు.
యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. పాఠశాలలో తమ కుమార్తెను ఆట పట్టించడం, బెదిరించడం, లైంగిక వేధింపుల వంటివి కొన్ని నెలల పాటు జరిగాయని ఆమె వెల్లడించారు. బాలిక తండ్రి కూడా మాట్లాడుతూ.. తమ కుమార్తెను మరో అబ్బాయిని ఉద్దేశిస్తూ తోటి విద్యార్థులు తరచూ ఏడిపించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అదంతా తట్టుకోలేక తమ 9 ఏళ్ల కుమార్తె బిల్డింగ్ మీద నుంచి దూకి మరీ ప్రాణాలు తీసుకుందని వాపోయారు.
అసలేం జరిగిందంటే..?
నవంబరు 1వ తేదీన ఆ విద్యార్థిని పాఠశాల నాల్గో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే.. రక్తపు మరకలు మాయం అయ్యాయి. ఈ అంశం బాలిక మరణంపై మరింత అనుమానాలను పెంచింది. తమ కుమార్తె మృతికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. తల్లిదండ్రులు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
డీసీపీ రాజర్షి రాజ్వర్మ స్పందిస్తూ.. విద్యార్థి తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకున్నామని అన్నారు. వారి ఆరోపణల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఈ తీవ్రమైన ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. చూడాలి మరి ఈ కేసులో తప్పు ఎవరిది, బాలిక ఇంతటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa