మహీంద్రా 'థార్' ఎస్యూవీ వాహనం కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదని.. అది రోడ్లపై విన్యాసాలు చేసే, ఆకతాయి మనస్తత్వం కలిగిన వ్యక్తులకు స్టేటస్ సింబల్గా మారిందని హర్యానా డీజీపీ ఓపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుగ్రామ్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడిన డీజీపీ.. తనిఖీల సమయంలో కొన్ని నిర్దిష్ట వాహనాలను అస్సలు వదిలి పెట్టమని స్పష్టం చేశారు. "మేము అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్ లేదా థార్ నడిపే వారైతే మాత్రం కచ్చితంగా తనిఖీ చేస్తాం. వాహనం ఎంపిక ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు" అని ఓపీ సింగ్ అన్నారు.
థార్ వాహనం వెనుక దాగి ఉన్న సమస్యను వివరించడానికి డీజీపీ ఒక తాజా ఉదంతాన్ని ఉదాహరించారు. ఇటీవల థార్ నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టిన కేసులో.. ఆ నిందితుడు ఒక ఏసీపీ కుమారుడు అని తెలిపారు. "తన కుమారుడిని రక్షించాలని సదరు అధికారి (ఏసీపీ) నన్ను వేడుకున్నారు. ఆ కారు ఏకంగా ఆ ఏసీపీ పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది" అని వెల్లడించారు. ఈ సందర్భంగా తమ కుమారుడిని కాపాడాలని కోరిన ఆ అధికారిని ఉద్దేశించి డీజీపీ సింగ్... 'మోసగాడు' అని వ్యాఖ్యానించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎవరి దగ్గర డీజీపీ, థార్ ఉంటే వాళ్లు క్రేజీ..
ఈ సందర్భంగా పక్కనే ఉన్న పోలీసు అధికారుల వైపు తిరిగి ఆయన ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. పోలీసు అధికారుల్లో ఎవరెవరి దగ్గర థార్ వాహనాలు ఉన్నాయో లిస్ట్ తయారు చేయాలని సూచించారు. "ఎవరి దగ్గర అది ఉంటే వాళ్లు క్రేజీ అని" (అంటే రిస్క్ తీసుకునేవారని లేదా అసాధారణమైన వారని) డీజీపీ వ్యాఖ్యానించారు. థార్ వాహనాలు అతి వేగంగా నడపడం వల్ల హర్యానాలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గత నెలలో ఓ హైవేపై వేగంగా వెళ్తున్న థార్ డివైడర్ను ఢీకొట్టి.. అందులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను కూడా డీజీపీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించే థార్, బుల్లెట్ బైక్ డ్రైవర్లపై ఉక్కుపాదం మోపాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa