ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకు గుడ్‌బై, కుటుంబంతోనూ తెగదెంపులు చేసుకున్న లాలూ కుమార్తె

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:48 PM

 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లాలూ కుమార్తె, తేజస్వి యాదవ్ సోదరి అయిన రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ.. తన కుటుంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహాకూటమి ఎన్నికల్లో ఓటమి పాలైన సమయంలోనే.. రోహిణి ఆచార్య ఈ నిర్ణయం తీసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. అసలు ఇందుకు గల కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


'నేనే బాధ్యురాలిని' అంటూ సంచలన ట్వీట్..


తన రాజీనామా గురించి రోహిణి ఆచార్య చేసిన ప్రకటన విస్మయం కలిగించేలా ఉంది. ఆమె ఈ నిర్ణయానికి సంజయ్ యాదవ్, రమీజ్ అనే ఇద్దరిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. "నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, అలాగే నేను నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను చేయమని అడిగింది ఇదే. నేను ఈ నిందనంతా స్వీకరిస్తున్నాను" అని రోహిణి ఆచార్య తన ఎక్స్ పోస్ట్‌లో రాశారు. లాలూ ప్రసాద్ కుమార్తె ఇలాంటి ట్వీట్ చేయడంతో.. క్షణాల్లోనే ఇది వైరల్ అయింది.


ఈక్రమంలోనే.. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానిపై, లాలూ కుటుంబంలోని అంతర్గత విభేదాలపై ఊహాగానాలు మొదలు అయ్యాయి. మహాకూటమి ఓటమికి, ముఖ్యంగా ఆర్జేడీ పరాజయానికి రోహిణిని బాధ్యురాలిగా చేస్తూ.. ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబంలో ఏర్పడిన అంతర్గత కలహాలకు ఇది పరాకాష్టగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


నిజానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి ఆచార్య సారన్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమి తర్వాత కుటుంబ సభ్యులు లేదా పార్టీలోని కొందరు ఆమెను రాజకీయాల నుంచి తప్పుకోవాలని బలవంతం చేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. లాలూ కుటుంబం బీహార్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉన్నప్పటికీ.. ఇటీవలి సంవత్సరాలలో వారసత్వం, పార్టీ వ్యూహాలపై అంతర్గత విభేదాలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.


రోహిణి ఆచార్య తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం.. లాలూ ప్రసాద్ యాదవ్ సుదీర్ఘ రాజకీయ వారసత్వాన్ని మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. రోహిణి వైదొలగడంపై ఆర్జేడీ పార్టీ, లాలూ కుటుంబం కానీ, తేజస్వి యాదవ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తం నిందను తనపై వేసుకుంటున్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఈ వివాదానికి తెరపడే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa