ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 660 మంది డిప్యూటీ మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లను (డిప్యూటీ MPDO) ప్రత్యేకంగా డిప్యూట్ చేయనుంది. ఈ నియామకాలతో సచివాలయాలలో సేవలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవ్వడం దాదాపు ఖరారైంది.
అదే సమయంలో జిల్లా స్థాయి పర్యవేక్షణను కూడా బలపరుస్తూ జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ అధికారులు సచివాలయాల పనితీరును నిరంతరం సమీక్షించి, లోపాలు సకాలంలో సరిదిద్దే విధంగా పనిచేయనున్నారు. దీనివల్ల క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏకరీతి పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పడనుంది.
సచివాలయాలను మూడు విభాగాలుగా వర్గీకరించిన విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ‘A’ కేటగిరీ సచివాలయాల్లో 6 మంది, ‘B’ కేటగిరీలో 7 మంది, ‘C’ కేటగిరీలో 8 మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ వర్గీకరణ ఆధారంగానే పర్యవేక్షకులు పనితీరు అంచనా వేస్తారని తెలుస్తోంది.
మొత్తం మీసం ఈ కొత్త ఏర్పాట్లతో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమీపంగా, వేగంగా అందే అవకాశం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సచివాలయ వ్యవస్థలో బలమైన పర్యవేక్షణ అనేది దీర్ఘకాలంగా రాష్ట్ర పాలనలో సానుకూల మార్పుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa