కార్తీకమాసంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది అయ్యప్ప మాల ధరిస్తారు. ప్రతి సంవత్సరం లానే.. ఈ ఏడాది కూడా కేరళలో కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ మొదలైంది. ఇది ప్రారంభమైన రెండో రోజునే లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనానికి తరలి వచ్చారు. అధికారులు ఊహించిన దానికన్నా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో.. సరైన సౌకర్యాలు లేక భక్తుల తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
అయ్యప్ప ఆలయం తెరుచుకోవడంతో.. మంగళవారం అయ్యప్ప దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయాయి. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఎదురు చూశారు. వారికి కనీసం తాగునీరు కూడా సరఫరాల చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుల కోసం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై శబరిమలలో రెండు కొత్త రూల్స్ అమలు చేయబోతున్నారు.
శబరిమలకు వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడంలో.. దేవస్థానం బోర్డు విఫలమైందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆలయ అధికారులు దర్శనం స్పాట్ బుకింగ్ల మీద ఆంక్షలు విధించారు. ఇకపై ప్రతి రోజు కేవలం 20 వేల స్పాట్ బుకింగ్ దర్శన టికెట్లను మాత్రమే జారీ చేయబోతున్నామంటూ దేవస్థానం అధికారులుప్రకటించారు. స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం భారీగా తరలివస్తున్న భక్తులతో పంబ కిక్కిరిసిపోతుంది. దీంతో నీలక్కల్లో కూడా 7 స్పాట్ బుకింగ్ కౌంటర్లను తెరవబోతున్నట్లు అధికారులు ప్రకటించార.
అలానే ఇకపై ప్రతి రోజు కేవలం లక్ష మంది భక్తులకే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంటుందని.. మిగిలిన భక్తులను మరుసటి రోజు దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అలానే భక్తుల రద్దీకి సంబంధించి అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) స్పందించింది. గతంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో భక్తులను చూడలేదని తెలిపారు. అలానే ఈ సారి మాల ధరించిన స్వాములతో పాటుగా సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని అధికారులు తెలిపారు. ఊహించని రీతిలో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయామని తెలిపారు. అందుకే దర్శనం స్పాట్ బుకింగ్ టికెట్లపై కోత విధించామని.. ఇకపై రోజుకు 20 వేల టికెట్లు మాత్రమే జారీ చేస్తామని.. అలానే లక్ష మందికి మాత్రమే దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa