ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ ఉన్నవాళ్లు ఊరగాయ పచ్చళ్లు తినొచ్చా,,,ఇవి తెలుసుకోండి

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 11:30 PM

డయాబెటిస్ అనేది రక్తంలో గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే వ్యాధి. ఈ రోజుల్లో జీవనశైలి కారణంగా ఈ వ్యాధి వస్తుంది. దేశంలో కోట్లాది మంది ఈ వ్యాధితో బాదపడుతున్నారు. తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉంటే.. పిల్లలకు కూడా అది వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండటం, ఊబకాయం మొదలైనవి డయాబెటిస్‌కి కారణాలు.


ఇక, షుగర్ ఉన్నవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే కుదరదు. ఏదైనా తినకూడనది తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతంగా పెరుగుతాయి. ఇంకా, డయాబెటిస్ రోగులకు ఓ డౌట్ ఉంటుంది. అందరు ఎంతో ఇష్టపడే ఊరగాయ పచ్చళ్లు మేం తినొచ్చా అని. ఈ విషయంలో డాక్టర్ కిరణ్ గంగా క్లారిటీ ఇచ్చారు.


ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో డయాబెటిస్ రోగులు పచ్చళ్లు తినొచ్చా, తింటే ఏమవుతుంది? రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయా అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చారు. షుగర్ రోగులు ఊరగాయలు తినాలనుకుంటే ఎలా తినాలో కూడా ఆయన చెప్పారు. ఆ పూర్తి వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.


ఊరగాయలు


ఆహారం రుచిగా అనిపించకపోతే.. మనలో చాలా మంది ఊరగాయను వేసుకుని తింటుంటాం. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. ఊరగాయ అంటేనే చాలా మంది నోళ్లల్లో నీళ్లు ఊరతాయి. మామిడి, ఉసిరి, టమాటా, అల్లం, పండు మిర్చి, కాకర కాయ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పచ్చళ్లు మన ఇళ్లల్లో తయారు చేసుకుంటారు.


ఊరగాయల్లో పేగులకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుందని డాక్టర్ చెబుతున్నారు. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే, డయాబెటిస్ రోగుసు ఊరగాయలు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని నమ్ముతారు. ఇందులో నిజమెంత?


ఉప్పు ఎక్కువైపోతుంది


ఊరగాయలు మంచి పులియబెట్టిన ఆహారం అని డాక్టర్ అంటున్నారు. కానీ వాటిలో చాలా ఉప్పు అంటే సోడియం, నూనె ఉంటాయి. సాధారణంగా ఊరగాయలు తినేటప్పుడు.. ఇతర ఆహార పదార్థాల్లో ఉప్పు తినడం ఆపరు. దీంతో.. ఊరగాయతో పాటు ఇతర ఆహారాలు తినడం వల్ల ఎక్కువ ఉప్పును తీసుకుంటాం.


పాత రోజుల్లో అన్నం లేదా చపాతీలో ఊరగాయ తినేవాళ్లు. అయితే, ఈ రోజుల్లో చిప్స్ , పాపడ్, కూరలు, వేయించిన ఆహారాలతో పాటు ఊరగాయలు తీసుకుంటున్నారు. దీంతో, గతంలో కంటే ఎక్కువగా ఉప్పును తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో ఉప్పు శాతం చాలా ఎక్కువైపోతుంది.


ఊరగాయలు షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చా?


​ఎక్కువ ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. కానీ, చాలా మంది దీని లైట్ తీసుకుంటారు. రక్తపోటు వల్ల కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇప్పటికే రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వివరిస్తున్నారు.


డయాబెటిస్ ఉన్నవాళ్లు నిరంతరం ఊరగాయలు తీసుకుంటే, వారి అధిక రక్తపోటు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది పరోక్షంగా మధుమేహ వ్యాధిగ్రస్తులను ప్రభావితం చేస్తుంది.


షుగర్ ఉన్నవారు ఊరగాయలు ఎలా తినాలి?


షుగర్ ఉన్నవారు ఊరగాయలు తినొచ్చని డాక్టర్ అంటున్నారు. అయితే, ఊరగాయ తినేటప్పుడు మిగతా ఆహారాల్లో ఉప్పు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల ఉప్పు బ్యాలెన్స్ అవుతుందని.. ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు.


అంతేకాకుండా షుగర్ ఉన్నవారు మార్కెట్లలో దొరికే ఊరగాయల్ని అవాయిడ్ చేయాలని చెబుతున్నారు. ఇంట్లో చేసిన ఊరగాయలు తినడం మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. ఊరగాయలతో పాటు భోజనంలో ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సలాడ్ ఉంచుకోవాలని ఈ విషయాల్ని గుర్తించుకోండి


​మార్కెట్లో దొరికే ఊరగాయల్లో వెనిగర్, యాడెడ్ ప్లేవర్స్ కలుపుతుంటారు. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే మార్కెట్లో దొరికే పికిల్స్ తినకండి.


ఊరగాయల్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకండి. ఎందుకంటే ప్లాస్టిక్ నూనె, వాసనను శోషించుకుంటుంది. దీంతో, ప్రమాదం పెరుగుతుంది. ఊరగాయల్ని సిరామిక్, గాజు జాడీల్లో స్టోర్ చేయండి.


మీకు ఏదైనా సందేహం ఉంటే డాక్టర్‌ని సంప్రదించి ఆ తర్వాత ఊరగాయలు తినండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa