ఆంధ్రప్రదేశ్లో భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న అభ్యంతరాలను మరింత సులువుగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మండల రెవెన్యూ అధికారి (MRO) స్థాయిలో అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి ఒక ఏడాది మాత్రమే గడువు ఉండగా, దాన్ని రెండేళ్లకు పెంచేలా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం రైతులకు ఊరటనిచ్చే అడుగుగా భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 వేల గ్రామాల్లో భూమి రీసర్వే జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో ఈ పని పూర్తయిందని డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కూడా వేగంగా పురోగమిస్తున్న ఈ ప్రక్రియ ద్వారా భూమి రికార్డులు పూర్తిగా శుభ్రపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రీసర్వే ప్రక్రియలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షలకు పైగా అభ్యంతరాలు నమోదయ్యాయని, అందులో 2 లక్షల అభ్యంతరాలను ఇప్పటికే స్థానిక అధికారులు పరిష్కరించినట్లు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మిగిలిన అభ్యంతరాలను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
మొత్తం రీసర్వే పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిగా, పారదర్శకంగా ముగించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ ధీమా వ్యక్తం చేశారు. రైతుల సహకారంతోనే ఈ భారీ కార్యక్రమం సఫలీకృతమవుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గి రికార్డులు శాశ్వతంగా సరిచేయబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa