ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌ను కైవసం

sports |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 04:08 PM

భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్‌లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్‌ను ముద్దాడింది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నేపాల్ బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నేపాల్ జట్టు 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఖులా షరీర్ 27 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.నవంబర్ 11న ఢిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్, నేపాల్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా జట్లు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు చేరింది. ఈ చారిత్రక విజయం దేశంలో అంధుల క్రికెట్‌కు మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించడానికి మార్గం సుగమం చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa