ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చండీగఢ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం.. ఆర్టికల్ 240పై క్లారిటీ ఇచ్చిన హోంశాఖ

national |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:20 PM

చండీగఢ్ పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని యోచించినట్లు ప్రచారం జరిగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025పై తలెత్తిన రాజకీయ తుఫానుకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో తాత్కాలికంగా తెరపడినట్లయింది. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురానున్నారనే వార్తల నేపథ్యంలో పంజాబ్‌లో అధికార, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ.. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో పలు అంశాలపై క్లారిటీ ఇచ్చింది.


డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ పరిపాలనకు సంబంధించి కీలక మార్పులు వచ్చే ఎలాంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎంహెచ్ఏ తేల్చి చెప్పింది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వ చట్టాల తయారీ ప్రక్రియను సరళీకృతం చేసే ప్రతిపాదన మాత్రమే పరిశీలనలో ఉందని వెల్లడించింది. ఈ ప్రతిపాదన చండీగఢ్ పాలన లేదా పరిపాలనా స్వరూపాన్ని మార్చడానికి ఉద్దేశించింది కాదని తేల్చి చెప్పింది.


అలాగే పంజాబ్ లేదా హర్యానా రాష్ట్రాలతో చండీగఢ్‌కు ఉన్న సంబంధాలను మార్చడం తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చేసింది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. దానికి సంబంధించిన వాటాదారులు (పంజాబ్, హర్యానా)తో తగిన సంప్రదింపులు జరిపిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.


వివాదం ఎందుకు?


పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్‌ను.. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టడంతో ఈ వివాదం రాజుకుంది. అండమాన్ నికోబార్ దీవులు వంటి దేశంలోని పలు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రపతి నేరుగా నియమాలు రూపొందించే అధికారాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 ఇస్తుంది. ఈ క్రమంలోనే చండీగఢ్‌ను కూడా ఆర్టికల్ 240 కిందకు తీసుకువస్తే.. పంజాబ్ గవర్నర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి బదులుగా.. రాష్ట్రపతి స్వతంత్ర లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించే అవకాశం ఉంటుంది.


ఈ ప్రతిపాదనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా.. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం చేపట్టిన ఈ చర్య పంజాబ్, హర్యానాల రాజధానిని లాక్కునే కుట్రగా భగవంత్ మాన్ అభివర్ణించారు. ఈ రాజ్యాంగ సవరణ పంజాబ్ అస్తిత్వంపై దాడి అని.. సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీయడంగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన వివరణతో.. పంజాబ్‌లో చెలరేగిన నిరసనలకు బ్రేక్ పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa