బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్.. ఈ సందర్భంగా పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే రిగ్గింగ్ జరిగిందని నిరూపించేందుకు ప్రస్తుతం తన వద్ద ఆధారులు ఏమీ లేవని వెల్లడించారు. బిహార్ ఎన్నికలకు సంబంధించి.. తన టీమ్ కొన్ని నెలల పాటు చేసిన సర్వే, జన్ సురాజ్ యాత్రలో క్షేత్ర స్థాయి అభిప్రాయాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
ఇక ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ.. 243 సీట్లలో 238 చోట్ల పోటీ చేసినా.. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం 2-3 శాతం ఓట్లను మాత్రమే సాధించి ఆ పార్టీ ఘోర వైఫల్యాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో కొన్ని అదృశ్య శక్తులు పనిచేశాయని ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుమానాలు లేవనెత్తారు. ప్రజలకు పెద్దగా తెలియని పార్టీలు కూడా లక్షల సంఖ్యలో ఓట్లను సాధించాయని పేర్కొన్నారు.
ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో అక్రమాలు జరిగాయని గట్టిగా చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని.. అయితే ఓడిపోయిన తర్వాత సర్వసాధారణంగా ఇలాంటి ఆరోపణలే వస్తాయని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని.. కానీ చాలా విషయాలు మాత్రం పొంతన లేకుండా ఉన్నాయని తెలిపారు. ప్రాథమికంగా చూస్తే మాత్రం ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోందని.. కానీ అదేంటో తెలియడం లేదని ఆయన తెలిపారు.
ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ఎన్డీఏ కూటమి వేలాది మంది మహిళా ఓటర్లకు నగదు పంపిణీ చేసిందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి పోలింగ్ రోజు వరకు మహిళలకు రూ.10 వేలు పంపిణీ చేశారని తెలిపారు. మహిళలకు మొత్తం రూ.2 లక్షలు ఇస్తామని.. అందులో ఇది మొదటి విడత మాత్రమేనని చెప్పారని గుర్తు చేశారు. ఎన్డీఏ, నితీష్ కుమార్ పార్టీకి ఓటు వేస్తే మిగిలిన డబ్బు వస్తుందని హామీ ఇచ్చారని మండిపడ్డారు. బిహార్లో లేదా దేశంలో ఎక్కడైనా ఒక ప్రభుత్వం 50 వేల మంది మహిళలకు ఇలా డబ్బు పంపిణీ చేయడం తనకు గుర్తులేదని పీకే ఎద్దేవా చేశారు.
ఇక తమ పార్టీ ఓటమికి మరో కీలక కారణం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని జంగిల్ రాజ్ తిరిగి బిహార్లోకి వస్తుందనే భయమేనని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ప్రచారం చివరి దశలో.. జన్ సురాజ్ పార్టీ గెలిచే స్థితిలో లేదని చాలా మంది ఓటర్లు అనుకున్నారని తెలిపారు. వారు అలా ఆందోళన చెందడం చాలా సులభమని.. తమకు ఓటు వేస్తే.. ఒకవేళ తాము గెలవకపోతే.. అది లాలూ 'జంగిల్ రాజ్' తిరిగి రావడానికి దారితీస్తుందేమోనని ఓటర్లు భయపడ్డారని తెలిపారు. ఆ భయం కచ్చితంగా కొంతమందిని తమకు దూరమయ్యేలా చేసిందని ప్రశాంత్ కిషోర్ వివరించారు.
ఇక ఈ ఎన్నికల్లో ఘోర ఓటమితో తన రాజకీయ జీవితం ముగిసిందంటూ విమర్శిస్తున్న వారిపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. తాను గెలిచినప్పుడు చప్పట్లు కొట్టినవారే.. ఇప్పుడు తన రాజకీయ సంస్మరణ పత్రాన్ని రాస్తున్నారని మండిపడ్డారు. తాను ఏం చేస్తాననే దానిపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తాను విజయం సాధిస్తే మళ్లీ వారే చప్పట్లు కొడతారని.. కథ ఇంకా పూర్తి కాలేదని ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవిష్యత్పై ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa