ప్రస్తుతం రవాణా వ్యవస్థలో భారత్.. ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరుతోంది. వందే భారత్ రైళ్లు, మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్ల తర్వాత ఇప్పుడు దేశీయ పట్టణ రవాణా వ్యవస్థ ఒక నూతన శకంలోకి అడుగుపెడుతోంది. మన దేశంలోనే మొట్టమొదటి పాడ్ ట్యాక్సీ నెట్వర్క్ను ప్రారంభించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విప్లవాత్మకమైన.. డ్రైవర్లెస్ రవాణా వ్యవస్థ థానే, నవీ ముంబై, మీరా-భయందర్ ప్రాంతాల మధ్య రోజువారీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేయనుంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేశంలోనే మొట్టమొదటి పాడ్ ట్యాక్సీ నెట్వర్క్కు ఆమోదం లభించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) పర్యవేక్షణలో ఈ పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్.. పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) మోడల్లో అమలు కానుంది. ఈ పీపీపీ పద్దతి ద్వారా ప్రైవేట్ కంపెనీలు తమ టెక్నికల్ స్కిల్స్, ఆర్థిక సహాయాన్ని అందించనున్నాయి. మరోవైపు.. ఈ పాడ్ ట్యాక్సీ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.
పాడ్ ట్యాక్సీలు అనేవి పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ మోడల్పై ఆధారపడి పనిచేస్తాయి. ఇవి డ్రైవర్ లేకుండానే.. విద్యుత్తో నడిచే చిన్నపాటి క్యాబిన్లు (పాడ్స్). ఇవి భూమికి ఎత్తులో నిర్మించిన ట్రాక్లపై ప్రయాణం చేస్తాయి. ప్రస్తుతం ఈ పాడ్ ట్యాక్సీల వ్యవస్థ అబుదాబి, లండన్, దక్షిణ కొరియా, జపాన్లలోని కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ఫుల్గా అక్కడి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.
ఇక మన దేశంలో ఉన్న అధిక జనసాంద్రత గల ప్రయాణ నమూనాలకు అనుగుణంగా ఈ పాడ్ ట్యాక్సీ మోడల్లో మార్పులు చేయనున్నారు. ఈ పాడ్ ట్యాక్సీ నెట్వర్క్ రోజువారీ ప్రయాణికులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా.. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు వీలుగా ఏ ఏ మార్గాలను కలుపుతూ నిర్మించాలి అనేది గుర్తించడానికి స్థానిక మున్సిపల్ సంస్థలతో కలిసి ఎంఎంఆర్డీఏ పనిచేయనుంది.
ఈ పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను మొత్తం ప్రైవేట్ సంస్థలే చేపట్టనున్నాయి. అయితే ఎంఎంఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా ఈ మొత్తం ప్రాజెక్ట్ను పర్యవేక్షించనుంది. ఈ వినూత్న ప్రాజెక్టు పూర్తి ప్రణాళిక, అమలు కోసం తదుపరి సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఈ పాడ్ ట్యాక్సీలు అమల్లోకి వస్తే ముంబైలో రవాణా వ్యవస్థ మరో స్థాయికి చేరుకోనుంది. అక్కడ సక్సెస్ అయితే.. ఈ పాడ్ ట్యాక్సీలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa