నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలో ఒక కేథలిక్ పాఠశాల నుంచి సాయుధ దుండగులు అపహరించిన 300 మందికి పైగా విద్యార్థుల్లో 50 మంది తమ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నారని క్రైస్తవ సంఘం ఆదివారం వెల్లడించింది. అయితే నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు సైతం.. తాజాగా జరిగిన మరో దాడిలో అపహరణకు గురైన 38 మంది భక్తులను రక్షించినట్లు ప్రకటించారు. నైగర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ కో-ఎడ్యుకేషన్ స్కూల్పై గత శుక్రవారం సాయుధులు దాడి చేసి, 303 మంది విద్యార్థులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణల్లో ఒకటిగా నిలిచింది.
50 మంది విద్యార్థుల సాహసం
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న 50 మంది విద్యార్థులు తమ కుటుంబాలను కలుసుకున్నారని క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విద్యార్థుల వయసు 8 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పేర్కొంది. అయితే పాఠశాల మొత్తం 600 మందికి పైగా విద్యార్థులు ఉండగా.. వారిలో దాదాపు సగం మంది కిడ్నాప్కు గురయ్యారు. మరోవైపు 51 మంది విద్యార్థులను రక్షించినట్లు అధ్యక్షుడు టినుబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా "గత కొద్ది రోజులుగా మా భద్రతా దళాల కృషితో క్వారా రాష్ట్రంలోని ఎరుకులో అపహరణకు గురైన 38 మంది భక్తులందరూ రక్షించబడ్డారు" అని ఆయన పేర్కొన్నారు.
తాను అస్సలే వెనకడుగు వేయనని.. నైజీరియా అధ్యక్షుడు టినుబు స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నైజీరియా పౌరుడికి భద్రతకు హక్కు ఉందని పేర్కొన్నారు. తన పర్యవేక్షణలో, తాము ఈ దేశాన్ని సురక్షితం చేసి, తమ ప్రజలను రక్షిస్తామని పునరుద్ఘాటించారు. గత వారంలో మొత్తంగా రెండు సార్లు కిడ్నాప్ జరిగింది. తొలిరోజు 25 మంది విద్యార్థులను అపహరించిన దుండగులు.. రెండోసారి 303 మంది విద్యార్థులు సహా 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. అయితే దీనిపై స్పందించిన పోప్ లియో XIV.. బంధీలను తక్షణమే విడుదల చేయాలని సాయుధులకు విజ్ఞప్తి చేశారు. ఏంజెలుస్ ప్రార్థనల ముగింపులో ఆయన.. అపహరణకు గురైన అనేక మంది యువ బాలబాలికల పట్ల, వారి కుటుంబాల వేదన పట్ల తన ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
నైజీరియాలో పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనలు దేశంలోని కొన్ని ప్రాంతాలలో పాఠశాలలను మూసివేయడానికి దారితీశాయి. దశాబ్దం క్రితం చిబోక్ పట్టణంలో ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు దాదాపు 300 మంది పాఠశాల బాలికలను కిడ్నాప్ చేసినప్పటి నుంచి నైజీరియాలో ఇలాంటి సామూహిక అపహరణల పరంపర కొనసాగుతోంది. ఈ దాడులకు ప్రధానంగా క్రిమినల్ ముఠాలే పాల్పడుతున్నాయి. వారు తరచుగా డబ్బు కోసం, భద్రత లేని మారుమూల బోర్డింగ్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటారు. బాధితులు సాధారణంగా చర్చల తర్వాత విడుదలవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa