మలక్కా జలసంధి సమీపంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈ రోజు (నవంబర్ 25) వాయుగుండంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) తాజా హెచ్చరికలు జారీ చేసింది. తర్వాతి 48 గంటల్లో ఇది పూర్తిస్థాయి తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ బంగాళాఖాతం వైపు కదులుతూ ఏపీ తీరాన్ని ప్రభావితం చేయనుంది.
అదే సమయంలో ఈ రోజు నైరుతి బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రెండు వ్యవస్థల కలయిక వల్ల రాష్ట్రంలో వర్షపాతం తీవ్ర స్థాయికి చేరనుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు ఈ దెబ్బకు ఎక్కువగా గురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నేటి నుంచి నవంబర్ 28 వరకు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది. అయితే నవంబర్ 29, 30 తేదీల్లో పరిస్థితి మరింత విషమంగా మారనుంది. ఈ రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.
ముంపు ప్రమాదం ఉన్న తీర, తక్కువ ప్రాంతాల్లో అప్రమతంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు ఈ రోజుల్లో సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల నిర్వహణ బృందాలు అలర్ట్ మోడ్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa