దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తీవ్రమైన పైలట్ల కొరత, కొత్త ఫ్లైట్ డ్యూటీ నిబంధనల కారణంగా ఆ సంస్థ భారీగా విమానాలను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఇండిగో నడపగల విమానాల సంఖ్యపై 10 శాతం కోత విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అంతకుముందు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో కార్యకలాపాలను 5 శాతం తగ్గించాలని ఆదేశించగా, తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ కోతను 10 శాతానికి పెంచింది. ఈ విషయంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "ఇండిగో మొత్తం రూట్లను తగ్గించడం అవసరమని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇది సంస్థ కార్యకలాపాలను స్థిరీకరించడానికి, విమానాల రద్దును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే 10 శాతం కోత విధించాం అని వివరించారు.ఈ ఆదేశాలను పాటిస్తూనే, ఇండిగో తన అన్ని గమ్యస్థానాలకు యథావిధిగా సర్వీసులు నడుపుతుందని ఆయన తెలిపారు. ఛార్జీల పరిమితి, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించాలని ఇండిగోకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.గత వారం రోజులుగా సిబ్బంది రోస్టర్లు, ఫ్లైట్ షెడ్యూళ్ల నిర్వహణలో ఇండిగో అంతర్గత తప్పిదాల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని, పరిస్థితిని సమీక్షించేందుకు ఇండిగో ఉన్నత యాజమాన్యంతో మరోసారి సమావేశమైనట్లు తెలిపారు. మంగళవారం కూడా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను మంత్రిత్వ శాఖకు పిలిపించి వివరాలు అడిగినట్లు చెప్పారు. డిసెంబర్ 6 వరకు రద్దయిన విమానాలకు 100 శాతం రిఫండ్లు పూర్తి చేశామని సీఈఓ ధృవీకరించారని, మిగిలిన రిఫండ్లు, బ్యాగేజీ అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో 65 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్ ఇండియా 27 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. నవంబర్ నెలలో ఇండిగో మొత్తం 951 విమానాలను రద్దు చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa