ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ప్రభుత్వ రాజకీయ కక్షల వల్లే భూ సమస్యలు పెరిగాయని నాదెండ్ల మనోహర్ ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 09:22 PM

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 22A భూ సమస్యల పరిష్కారం కోసం ఏలూరు జిల్లాలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన 'మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక'లో ఆయన పాల్గొని ప్రజలు, రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగా రాష్ట్రంలో 22A భూ సమస్యలు తీవ్రంగా మారాయని ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని వారి ప్రైవేట్ భూములను కూడా ఉద్దేశపూర్వకంగా 22A జాబితాలో చేర్చారని, దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు తమ భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారని తెలిపారు.ఈ ప్రత్యేక వేదిక ద్వారా జిల్లాలోని 27 మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, 90 శాతం సమస్యలను ఇదే రోజు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేవాదాయ, ఇతర శాఖలకు సంబంధించిన భూముల సమస్యలను ఒకటి, రెండు వారాల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మంత్రి, ఎమ్మెల్యేలు స్వయంగా వినతులు స్వీకరించడంపై రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa