జపాన్లోని కినోకావాలో ఉన్న కీషి స్టేషన్కు స్టేషన్ మాస్టర్గా పనిచేసిన 'నితమా' అనే పిల్లి మరణించింది. గత అక్టోబర్ చివరి నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న 15 ఏళ్ల నితమా.. నవంబర్ 20న కన్నుమూసింది. అయితే ఈ రైల్వే పిల్లి అంత్యక్రియలకు దేశం నలుమూలల నుంచి 500 మందికి పైగా అభిమానులు, ప్రయాణికులు హాజరయ్యారు. నితమా మరణించిన తర్వాత వకయామా ఎలక్ట్రిక్ రైల్వే కో.. ఆ పిల్లిని 'గౌరవ ప్రత్యేక స్టేషన్మాస్టర్'గా ప్రకటించి తగిన గౌరవాన్ని అందించింది.
జపాన్లోని వకయామా ఎలక్ట్రిక్ రైల్వే కో నడుపుతున్న కిషిగావా లైన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండేది. ఆ లైన్ను మూసివేసే ప్రమాదం కూడా ఏర్పడింది. దీంతో వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఈ రైల్వే స్టేషన్లో సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. రైల్వే అధికారులు కొత్తగా, ఆకర్షణీయంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే తమకు ఓ పిల్లి 'తమ' కనిపించింది. అది చాలా అందంగా ఉండడం.. అందరితోనూ కలిసిపోవడం చూసిన రైల్వే అధికారులు దాన్ని స్టేషన్ మాస్టర్గా నియమించారు. అలాగే ఈ పిల్లికి రైల్వే నుంచి అధికారికంగా యూనిఫామ్ (చిన్న క్యాప్), ఐడీ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు. అయితే విధుల సమయంలో దీన్ని స్టేషన్లో ఉంచేవారు. అప్పుడు కూడా అది అక్కడక్కడే తిరుగుతుండేది.
2007లో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకోగా.. తమ నియామకం మార్కెటింగ్ సంచలనంగా మారింది. ఇది దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వార్తల్లో నిలిచింది. దీంతో కీషి స్టేషన్ను చూడటానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే 'తమ' స్టేషన్ మాస్టరే అయినప్పటికీ ఏ పనులూ చేయదు. కేవలం పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల మొదటి సంవత్సరంలోనే రైల్వేకు 9.2 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. మొత్తం రైడర్షిప్ను 17 శాతం పెంచింది. అయితే దురదృష్టవశాత్తు 2015లో ‘తమ’ చనిపోయింది. దీంతో రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టు ఖాళీ అయింది. అయితే అప్పుడు కూడా మనిషిని నియమించకుండా.. ఇలాంటి మరో పిల్లినే నియమించాలని రైల్వే అధికారులు భావించారు.
మరోవైపు కారు కింద పడి చనిపోబోతున్న ఓ పిల్లిని రక్షించిన రైల్వే అధికారులు.. దాన్ని దత్తత తీసుకుని శిక్షణ ఇప్పించారు. దానికి నితమా అని పేరు పెట్టుకుని ఇడాకిసో స్టేషన్ మాస్టర్గా నియమించారు. చాలా రోజులు నితమా అక్కడ విధులు నిర్వర్తించింది. అయితే తమ చనిపోయిన తర్వాత నితమాను ఇక్కడకు తీసుకువచ్చి.. కీషి స్టేషన్ మాస్టర్గా నియమించారు. అప్పటి నుంచి ఇది ఇక్కడే పని చేస్తుంది. అయితే ప్రస్తుతం నితమా వయసు 15 ఏళ్లు కాగా.. దాదాపు పదేళ్ల నుంచి కీషి స్టేషన్లోనే పని చేస్తోంది. ఇటీవలే నితమా చనిపోగా.. అంత్యక్రియలను కీషి స్టేషన్లోనే నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా అభిమానులు హాజరు అయి.. ఆమె చిత్రపటం ముందు నిలబడి ప్రార్థనలు చేశారు. కొందరు పూల బొకేలు, మరికొందరు పిల్లి ఆహారాన్ని తీసుకు వచ్చి ఫొటో ముందు ఉంచారు. "నితమా అంకితభావంతో పనిచేసింది. దాని మృతిని తట్టుకోలేకపోతున్నాం. ఇకపై అది లేకుండానే మేము పని చేయాలి" అని వకయామా ఎలక్ట్రిక్ రైల్వే అధ్యక్షుడు మిత్సునోబు కొజిమా అన్నారు. నితమా వల్ల తమకు ఎంత లాభ వచ్చిందనే వివరాలను రైల్వే శాఖ వెల్లడించకపోయినప్పటికీ.. అది కూడా పర్యాటక రంగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa