మనం ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గాలికి ఏవేవో కొట్టుకొస్తూ.. ఒంటిపై, ముఖంపై దుమ్మూ ధూళి పడుతుంటాయి. ఒక్కోసారి చెత్తాచెదారం కూడా కొట్టుకొస్తూ నోట్లోనూ పడుతుంటాయి. అలా ఎండిపోయిన ఆకులో, కాగితాలో వచ్చి నోట్లో చేరితే వెంటనే మనం ఉమ్మేస్తుంటాం. ఇదంతా అందరూ చేసేది. దీంట్లో పెద్ద తప్పేమీ లేదు. కానీ ఇదే పని చేసినందుకు ఓ 86 ఏళ్ల వృద్ధుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.36 వేల జరిమానా విధించారు. మరి ఈ కథ ఎక్కడ జరిగింది, గాలికొచ్చిన ఆకు నోట్ల పడ్డందుకు ఉమ్మినందుకే ఇంత జరిమానా వేయడం వెనుక కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటన్లో చట్టాన్ని అతిగా అమలు చేసిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 86 ఏళ్ల వృద్ధుడు రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వెళ్లిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ స్థానిక అధికారులు ఏకంగా 250 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.30,337) జరిమానా విధించారు. న్యాయ పోరాటం తర్వాత జరిమానా 150 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.18,202) తగ్గించినప్పటికీ.. ఈ 'నిర్దోషి' చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆకు ఉమ్మేస్తే రూ.30 వేలు ఫైన్
లింకన్షైర్లోని సౌత్ పరేడ్ కార్ పార్క్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న రాయ్ మార్ష్ విశ్రాంతి కోసం ఆగినప్పుడు.. గాలికి ఒక పెద్ద ఎరుపు రంగు ఆకు ఆయన నోట్లోకి వెళ్లింది. తీవ్ర ఆస్తమా, గుండె సమస్యలతో బాధ పడుతున్న మార్ష్.. ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండేందుకు వెంటనే ఆ ఆకును వెంటనే ఉమ్మివేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. మార్ష్ నేలపై ఉమ్మేశారని ఆరోపించారు. తాను ఉమ్మింది ఆకు మాత్రమేనని మార్ష్ వివరించినా, అధికారులు వినిపించుకోకుండా అతనికి జరిమానా విధించారు. ఈ చర్యతో ఆగ్రహించిన మార్ష్ ఆ అధికారిని 'సిల్లీ బాయ్' అని పిలిచి అవమానపరిచారు.
అయితే తన తండ్రి రాయ్ మార్ష్ పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన కూతురు జేన్ మార్ష్ ఫిట్జ్ప్యాట్రిక్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తమా, గుండె సమస్యలతో బాధ పడుతున్న వృద్ధుడిని వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా.. జరిమానా విధించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. "వారు వృద్ధులను అనవసరంగా వేధిస్తున్నారు. ఇది సిగ్గుచేటు!" అని ఫిట్జ్ప్యాట్రిక్ తన ఫేస్బుక్ పోస్ట్లో మండిపడ్డారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం ముఖ్యమే అయినప్పటికీ.. అధికారులు ఇటువంటి ఘటనలలో తమ విచక్షణను ఉపయోగించాలని, నిజంగా ప్రమాదవశాత్తు జరిగితే క్షమాపణ చెప్పి, దాన్ని తీసివేయడానికి అవకాశం ఇవ్వాలని కౌంటీ కౌన్సిలర్ ఆడ్రియన్ ఫిండ్లే కూడా అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలకు బదులిచ్చిన ఈస్ట్ లిండ్సే జిల్లా కౌన్సిల్.. తమ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని, వివక్ష చూపడం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఏదేమైనా ఒక ఆకు కోసం వృద్ధుడికి ఇంత భారీ జరిమానా విధించడం స్థానికులలో ఆగ్రహాన్ని పెంచుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa