ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూముల వర్గీకరణపై విచారణ.. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 07:38 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలోని భూముల వర్గీకరణ అంశంపై విచారణ జరపాలని నిర్ణయించింది. సీఆర్డీఏ పరిధిలోని భూములను గతంలో జరీబు, నాన్ జరీబు భూములుగా వర్గీకరించారు. అయితే ఈ వర్గీకరించిన విధానంపై విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఆర్డీఏ పరిధిలోని భూముల వర్గీకరణలో గతంలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా జరీబు భూములు (బావుల కింద సాగుచేసే భూములు) గుర్తింపు కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి గుంటూరు కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో సీఆర్డీఏ అధికారులతో పాటుగా రెవెన్యూ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.


ఈ ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఈ పర్యటన సమయంలో.. భూమి రికార్డులను పరిశీలించటంతో పాటుగా.. గతంలో చేపట్టిన వర్గీకరణను పరిశీలించనున్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లు గుర్తిస్తే.. వాటిపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది. మరోవైపు 45 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి.. సమగ్ర నివేదికను సమర్పించాలని ఈ ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు భూముల రకాన్ని అనుసరించి ప్యాకేజీ, పరిహారం మారుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ పరిధిలో భూముల వర్గీకరణ అంశంపై సమగ్ర విచారణ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. భూ వర్గీకరణలో తమకు అన్యాయం జరిగిందంటున్న రైతులకు ఊరట దక్కే అవకాశాలు ఉన్నాయి.


మరోవైపు అమరావతిలో జరీబు భూములు ఉన్న రైతులకు 1450 చదరపు గజాలు , నాన్ జరీబు భూములు ఉన్న రైతులకు 1250 చదరపు గజాల చొప్పున ఏపీ ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. అయితే కొంతమంది రైతులు తమవి కూడా జరీబు భూములేనని.. ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ కమిటీ 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని.. ఈ నివేదిక ఆధారంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కంఠాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి.. ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకుంటారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa