పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025 .. ధూమపానం చేసేవారి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ చట్టం ద్వారా సిగరెట్లు , పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు ప్రకారం.. సిగరెట్లపై సుంకాలు ఊహించని రీతిలో పెరగనున్నాయి. ఈ కొత్త చట్టం కారణంగా సిగరెట్ల ధరలు అమాంతం నాలుగు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అయితే దేశంలో పొగాకు వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 1000 సిగరెట్ స్టిక్స్పై రూ.200 నుంచి రూ.735 వరకు ట్యాక్స్ ఉంది. ఈ కొత్త సవరణ చట్టం ద్వారా దాన్ని రూ.2,700 నుంచి రూ.11 వేల వరకు పెంచారు. సిగరెట్ రకం, దాని పొడవుపై ఆధారపడి ఈ ట్యాక్స్ విధించారు.
ఈ ట్యాక్స్ పెంపు అమల్లోకి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.18 పలుకుతున్న ఒక సిగరెట్ ధర ఏకంగా రూ.72 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సిగరెట్ల ధరల పెంపు వార్తపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలోని కాలుష్యాన్ని ఉద్దేశించి ఒక నెటిజన్ స్పందిస్తూ.. "నాకేం పర్వాలేదు, నేను ఇప్పటికే ఢిల్లీ గాలిని ఉచితంగా పీలుస్తున్నాను" అంటూ సెటైరికల్గా కామెంట్ చేశారు.
కొంతమంది ధూమపాన ప్రియులే ఈ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. "ధరలు పెరగడం వల్ల కనీసం విద్యార్థులు, యువత సిగరెట్లకు దూరంగా ఉంటారని, తాము కూడా ఈ అలవాటును మానుకోవడానికి ఇది ఒక అవకాశం" అని ఒక రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. ధరలు పెంచినంత మాత్రాన ఇప్పటికే సిగరెట్ల బారిన పడి.. దాన్ని వ్యసనంగా మార్చుకున్న వారు ధూమపానం మానేస్తారా లేక దీనివల్ల అక్రమ రవాణా పెరుగుతుందా అనే సందేహాలు కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త చట్టం ద్వారా యువతను ధూమపానానికి దూరంగా ఉంచుతుందని కొంతమంది హర్షిస్తుండగా.. మరికొందరు మాత్రం దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa