అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫీల్ అయ్యారని, ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆయన కూడా బాధపడ్డారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమే తప్ప, మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అన్నమయ్య జిల్లా నూతన కేంద్రంగా మదనపల్లెను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణం ఆ హోదాను కోల్పోయింది. తన నియోజకవర్గం జిల్లా కేంద్రం కాకుండా పోవడంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయన్ను ఓదార్చి, భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు.రాయచోటి విషయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి బాధలో అర్థముందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. అయితే, జిల్లా కేంద్రంగా రాయచోటితో కలిసి ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదని ఆయన వివరించారు. రాజంపేట ప్రజలు తమను కడప జిల్లాలో కలపాలని, రైల్వే కోడూరు వాసులు తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో జిల్లా ఐక్యతను కాపాడేందుకే, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంగా మదనపల్లెను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సర్దుబాటు చేయకపోతే జిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.ఈ గందరగోళానికి గత ప్రభుత్వ అసంబద్ధ, అశాస్త్రీయ జిల్లాల విభజనే కారణమని అనగాని విమర్శించారు. ఆనాడు పారదర్శకంగా, ప్రజాభిప్రాయం మేరకు విభజన చేపట్టి ఉంటే నేడు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. దాని ఫలితమే ఇప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని అన్నారు. ఏదేమైనా, రానున్న రోజుల్లో రాంప్రసాద్ రెడ్డి ఈ బాధ నుంచి బయటపడతారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో రాయచోటి ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని అనగాని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa