రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. కూటమి ప్రభుత్వం పౌరహక్కులను, స్వేచ్ఛను హరిస్తోందని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు 36వ స్ధానానికి దిగజారిందని, అయినా తీరు మార్చుకోని పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో, దిక్కుతోచని ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. జగన్గారి ఫ్లెక్సీల వద్ద జంతుబలులు, రక్త తర్పణాలు చేశారంటూ, వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతోందని మనోహర్రెడ్డి తెలిపారు. నిజానికి రాష్ట్రంలో ఆ జాడ్యాన్ని ప్రారంభించిందే టీడీపీ అని, అయినా సీఎం, హోం మంత్రి ఇద్దరూ వైయస్ఆర్సీపీని నిందిస్తున్నారని అన్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిౖని థర్డ్ డిగ్రీతో హింసించారని, ఇంకా సంకెళ్ళతో నడి రోడ్డుపై పరేడ్ చేయించారని తెలిపారు. ఇది కచ్చితంగా పౌరుల గోప్యత హక్కు హరించడమే కాకుండా, సుప్రీం తీర్పుకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని మనోహర్రెడ్డి తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa