జులై 2024 నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీలు ముఖ్యంగా హిందువులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయడానికి హిందువులు భయపడుతున్నారు. అక్కడి అతిపెద్ద హిందూ సంస్థ అయిన ధాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రిస్టియన్ బౌద్ధ ఐక్యత మండలి ఎన్నికల సంఘాన్ని కలిసి తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. హిందువులకు ప్రత్యేక భద్రత కల్పించాలని, సురక్షితంగా ఓటు వేయడానికి ప్రత్యేక పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఇటీవల హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యల నేపథ్యంలో ఈ అభ్యర్థన చేశారు.
ఎన్నికల సంఘంతో హిందూ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. హిందువులలో భయం పెరుగుతోందని, బెదిరింపులు, దాడుల కారణంగా చాలామంది ఓటు వేయడానికి వెనకాడుతున్నారని వివరించారు. మైనార్టీలపై హింస జరిగిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం వల్ల భయం తగ్గి, దాడులు నివారించవచ్చని వారు సూచించారు. బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి.
ఈ అభ్యర్థన బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, చిట్టగాంగ్ ప్రాంతంలోని దగన్భుయాన్లో 28 ఏళ్ల సమీర్ దాస్ అనే ఆటో డ్రైవర్ను కొట్టి, కత్తితో పొడిచి చంపారు. అతడి ఆటోరిక్షాను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. ఇటీవల జరిగిన మరికొన్ని సంఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పబ్నా జిల్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ప్రోలయ్ చాకి జైల్లో గుండెపోటుతో మరణించారు. ఆయనను విద్యార్థి ఉద్యమంపై దాడి కేసులో అరెస్ట్ చేశారు. గత వారం జోయ్ మహాపాత్రో అనే హిందూ వ్యక్తిని స్థానిక ముస్లిం అమీరుల్ ఇస్లాం కొట్టి, విషం పెట్టి చంపాడని ఆరోపణలున్నాయి.
ఇంకా, 25 ఏళ్ల మిథున్ సర్కార్ అనే హిందూ యువకుడు దొంగతనం ఆరోపణలతో తనను వెంబడించిన గుంపు నుంచి తప్పించుకోవడానికి కాలువలోకి దూకి మరణించాడు. యస్సోర్ జిల్లాలో హిందూ వ్యాపారవేత్త, వార్తాపత్రిక సంపాదకుడు రాణా ప్రతాప్ బైరాగిని సోమవారం కాల్చి చంపారు. అదే రోజు, హిందూ కిరాణా దుకాణం యజమాని శరత్ మణి చక్రవర్తి కూడా మరణించారు.
ఒక హిందూ మహిళపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు కట్టి, ఆమె జుట్టు కత్తిరించారని ఆరోపణలున్నాయి. అంతకుముందు, మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దైవదూషణ ఆరోపణలపై కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు. ఈ ఘటన తర్వాత అమృత్ మండల్ అనే వ్యక్తిని డబ్బుల కోసం బెదిరించారనే ఆరోపణలపై దాడిచేసి ప్రాణాలు తీశారు. అదే ప్రాంతంలో, బజేంద్ర బిస్వాస్ అనే హిందూ వస్త్ర కర్మాగార కార్మికుడిని కాల్చి చంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa