ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇంట్లో ఉండి పిల్లల్ని కనడమే ఉత్తరాది మహిళల పని'.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 08:31 PM

తమిళనాడులో మహిళల విద్యా పురోగతిని కొనియాడుతూ.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఉత్తరాది మహిళలు కేవలం గృహిణులుగా, పిల్లలను కనేవారికే పరిమితం అవుతున్నారని దయానిధి మారన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని క్వాయిడ్ ఇ మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాలలో మంగళవారం జరిగిన ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దయానిధి మారన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ద్రావిడ మోడల్ విద్య గురించి వివరిస్తూ.. ఆయన ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చారు.


తమిళనాడులో అమ్మాయిలను బాగా చదువుకోమని డీఎంకే ప్రభుత్వం ప్రోత్సహించిందని తెలిపిన దయానిధి మారన్.. కానీ ఉత్తరాదిలో మాత్రం అమ్మాయిలు పనికి వెళ్లొద్దు.. ఇంట్లోనే ఉండండి.. వంటగదిలో పని చేయండి.. పిల్లల్ని కనండి.. అదే వారి పని అని చెబుతారని పేర్కొన్నారు. తమిళనాడు విద్యార్థినులు ల్యాప్‌టాప్‌లతో ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారని.. కానీ ఉత్తరాదిలో ఇంగ్లీష్ చదవొద్దని భయపెడుతున్నారు. కేవలం హిందీకే పరిమితం చేసి వారిని బానిసలుగా ఉంచుతున్నారని దయానిధి మారన్ చెప్పారు. ఉత్తరాదిలో విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే అక్కడి ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస వస్తున్నారని వెల్లడించారు.


దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దయానిధి మారన్‌కు కనీస కామన్ సెన్స్ లేదని.. తమిళనాడు బీజేపీ ప్రతినిధి నారాయణన్ తిరుపతి విమర్శించారు. దయానిధి మారన్ ఉత్తరాది ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారత్ శక్తిని (మహిళలను) ఆరాధించే దేశమని.. మహిళలను ఉత్తర, దక్షిణ అని విభజించడం దయానిధఇ మారన్ అజ్ఞానానికి నిదర్శనమని బీజేపీ నేత అనిలా సింగ్ అన్నారు. ద్రౌపదీ ముర్ము, సోనియా గాంధీ వంటి వారిని ఆయన మర్చిపోయారా అని ప్రశ్నించారు.


అయితే దయానిధి మారన్ చేసిన ఈ వ్యాఖ్యలను డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ సమర్థించారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల విధానాల వల్లే ఇలాంటి వ్యత్యాసాలు ఉంటాయని పేర్కొన్నారు. తమిళనాడులో మహిళలకు విద్య, ఉపాధి, రిజర్వేషన్లు కల్పించి వారిని సాధికారత వైపు నడిపిస్తున్నామని.. ఉత్తరాదిలో వారి హక్కుల కోసం పోరాడేవారు తక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa