ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక సీఎం పీఠంపై సస్పెన్స్.. రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ

national |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 08:33 PM

కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం మైసూరు పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విడివిడిగా కలిసి.. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలని కోరినట్లు తెలుస్తోంది. మైసూరు ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ భేటీలో.. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రభావం పడుతోందని అటు సిద్ధు, ఇటు డీకే ఇద్దరు నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.


కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం లేవనెత్తిన ఈ అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ.. సంక్రాంతి తర్వాత ఢిల్లీకి రావాలని.. అక్కడ అధిష్టానంతో కలిసి పూర్తిస్థాయిలో చర్చిద్దామని సూచించినట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రిగా తన పదవిని కాపాడుకోవడంతో పాటు.. రాష్ట్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని రాహుల్‌ గాంధీని సిద్ధరామయ్య కోరారు. అదే సమయంలో పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి.. కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తిని తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు.


డీకే శివకుమార్ వర్గం ఆశలు


2023 ఎన్నికల విజయం తర్వాత.. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. అయితే.. అధిష్టానం నచ్చజెప్పడంతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో కుదిరిన రొటేషనల్ సీఎం (పదవీకాలం పంపకం) ఒప్పందం ప్రకారం.. రెండున్నరేళ్ల తర్వాత తనకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ వర్గం గట్టిగా కోరుతోంది.


 మరోవైపు.. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై బయట జరుగుతున్న ప్రచారంపై ఇద్దరు నేతలు భిన్నంగా స్పందించడం గమనార్హం. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని.. ఇవన్నీ మీడియా సృష్టిస్తున్న ఊహాగానాలేనని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు అనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు.. ఇదే విషయంపై స్పందించిన డీకే శివకుమార్.. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని.. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అని.. తమ మధ్య జరిగిన చర్చలు అన్నింటినీ బయటికి చెప్పలేమని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై రాహుల్ గాంధీకి వివరించినట్లు డీకేఎస్ చెప్పారు.


2023 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. అయితే కర్ణాటక సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఢిల్లీలో సుదీర్ఘ చర్చల తర్వాత సిద్ధరామయ్యకు సీఎం పదవి.. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయితే అధికారికంగా బయటికి ప్రకటించకపోయినప్పటికీ.. 30 నెలల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం అప్పటి నుంచి సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa