ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు భాగస్వామ్యం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ సహా వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2047 నాటికి రాష్ట్రం మొత్తం భూ భాగంలో 50 శాతం పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న పవన్ కళ్యాణ్.. అందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37 శాతం పచ్చదనం నింపాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం గ్రీనరి ఉండగా.. రాబోయే నాలుగేళ్లలో మరో 7 శాతం గ్రీనరీ పెంచాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలని.. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాల్సిందిగా పిలుపునిచ్చారు. జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారులకు ఇరువైపులా కూడా మొక్కలు నాటేలా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కూడా గ్రీన్ కవర్ పెంపునకు సహాయపడుతుందని.. 970 ఎకరాల తీర ప్రాంతం వెంబడి 40 శాతం అటవీ శాఖ పరిధిలో ఉండగా, మిగిలిన భూభాగంలో ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాలని సూచించారు. తీర ప్రాంతం వెంబడి ఆయా వాతావరణ పరిస్థితులను తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
రైతుల భూములు, కాలువలు, చెరువు గట్ల వెంబడి పండ్ల రకాల మొక్కలు నాటాలని, పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ పనుల కోసం అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని.. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో రావాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa